చైనాను పక్కనపెట్టడం భారత్కే బ్యాడ్
బీజింగ్ : మరోసారి చైనీస్ మీడియా భారత్ పై తన అక్కసును వెళ్లగక్కింది. హై-స్పీడ్ ట్రైన్ ప్రాజెక్టుల భాగస్వామ్యంలోకి చైనాను అనుమతించకుండా.. పక్కనపెట్టడం భారత్ కే మంచిది కాదంటూ చైనీస్ డైలీ మంగళవారం విమర్శల వర్షం కురిపించింది. గ్లోబల్ టైమ్స్ ఎడిటోరియల్ దీనికి సంబంధించిన ఓ కాలమ్ను రాసింది. హై-స్పీడ్ ట్రైన్లు కావాలనుకున్నప్పుడు దేశ ఆర్థికాభివృద్ధికి ఆటంకం కలిగించే రక్షణాత్మక ఆర్థిక ధోరణులను భారత్ కలిగి ఉండకూడదని గ్లోబల్ టైమ్స్ వ్యాఖ్యానించింది.
ఉక్కు రైళ్ల తయారీ, రైళ్ల సాంకేతికలో చైనాకు భారత్ అవసరం కంటే, భారత్ కు చైనా అవసరమే ఎక్కువని ఉద్ఘాటించింది. హై-స్పీడ్ రైల్వే ప్రాజెక్టులో భారత్ జపాన్ ను తన భాగస్వామిగా ఎంచుకుంది. చైనాను పక్కనపెట్టింది. దీంతో ఆగ్రహించిన చైనా ఈ మేరకు విమర్శలు చేసింది. 2018 నుంచి ఈ ప్రాజెక్టు భారత్ లో ప్రారంభకాబోతుంది. ఆర్థిక వ్యవస్థలో కొత్త పేరుని సొంతం చేసుకోవడానికి చైనా ఇటీవల ప్రపంచవ్యాప్తంగా హై-స్పీడ్ రైల్ టెక్నాలజీ ఎగుమతులను శరవేగంగా పెంచుతోంది. గతేడాది కూడా చైనా ఉక్కు ఉత్పత్తులపై భారత్ యాంటీ-డంపింగ్ డ్యూటీలను ఆరు నెలల పాటు విధించింది.