ముఖ్యమంత్రి వాచ్ ఖరీదు అరకోటిపైనే !!

ముఖ్యమంత్రి వాచ్ ఖరీదు అరకోటిపైనే !! - Sakshi


బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధరించే వాచ్, కళ్లద్దాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. సీఎం సిద్ధరామయ్య రూ.50-70లక్షల విలువచేసే వాచ్‌ను, రెండు లక్షల రూపాయల విలువ చేసే కళ్లద్దాలు ధరిస్తారని మాజీ సీఎం హెచ్.డి.కుమారస్వామి ఆరోపించారు. ‘లోహియా’ ఆదర్శాలను పాలించే వ్యక్తిగా, అనుచరుడిగా సీఎం సిద్ధరామయ్య తనకు తాను చెప్పుకుంటూ ఉంటారు. అయితే సిద్ధరామయ్య లోహియా పేరును కేవలం ప్రచారానికి మాత్రమే ఉపయోగిస్తున్నారని, ఆయన నిజజీవితం పూర్తిగా విలాసవంతమైనదంటూ కుమారస్వామి ఆరోపించారు.

 

ఈ విషయంపై సీఎం సిద్ధరామయ్య కూడా స్పందించారు. ‘కుమారస్వామి చెప్పేవన్నీ అబద్ధాలే, కావాలంటే నా కళ్లద్దాలను రూ.50వేలకు, నా వాచ్‌ను పది లక్షల రూపాయలకు ఇచ్చేస్తాను, తీసుకోమనండి’ అంటూ ప్రతిస్పందించారు. అయితే ఈ విషయానికి సంబంధించిన ఆధారాలను హెచ్.డి.కుమారస్వామి మంగళవారం మీడియాకు అందజేశారు. ‘సిద్ధరామయ్య ధరించే వాచ్ హ్యూబ్లోట్ బ్రాండ్‌కు చెందినది. ఈ వాచ్‌ను పూర్తిగా బంగారుపూతతో తయారుచేస్తారు. డయల్‌లోని నంబర్‌ల స్థానంలో వజ్రాలను పొదుగుతారు. అందువల్లే ఈ వాచ్ ధర రూ.50-70లక్షలుగా ఉంటుంది.


సిద్ధరామయ్య ఓ పెళ్లికి హాజరైనపుడు ఆయన ఈ వాచ్‌ను ధరించారు. ఆ వీడియోను వాట్సాప్ ద్వారా తెప్పించుకొని ఆ వీడియోను దుబాయ్‌కి పంపించి, ఈ విషయాన్ని నిర్ధారించుకున్నాను’ అని తెలిపారు. ఈ విమర్శలతో కర్ణాటకలో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top