చేయి పట్టుకుని చెల్లెలు అంటున్నాడు !
మదికేరి: నలుగురిని మంచి మార్గంలో నడిపించాల్సిన నాయకులే దిగజారి ప్రవర్తిస్తున్నారు. కర్ణాటకకు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే బహిరంగ సభలోనే మహిళ ఎమ్మెల్సీ చేయి పట్టుకున్న దృశ్యం కెమెరా కంటికి చిక్కింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కర్ణాటకలోని మదికేరిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది.
మదికేరి కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రస్తుత సిల్క్ బోర్డ్ చైర్మన్, ఎమ్మెల్యే టీవీ రమేష్ వేదికపై తన పక్కన కూర్చున్న ఎమ్మెల్సీ వీణా అచ్చయ్య చేయిని పట్టుకున్నారు. వెంటనే ఆమె అతని చేతిని తోసేసింది. అయినా అంతటితో అగకుండా ఆ నేత నవ్వుతూ మరోసారి మహిళా ఎమ్మెల్సీ చేతిని పట్టుకోవడానికి ప్రయ్నతించారు. ఈ సంఘటనపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ ఘటనపై టీవీ రమేష్ వివరణ ఇస్తూ.. ‘వీణా నేను ఒకే ప్రాంతానికి చెందిన వాళ్లం. అంతేకాక ఆమె నాకు సోదరితో సమానం. మేమిద్దరం ఆరోగ్య సంబంధమైన విషయాల గురించి మాత్రమే చర్చించుకున్నాం. అంతేకాని నేను ఆమెను వేరే దృష్టితో చేయి పట్టుకోలేదు. నా ప్రతిష్టను దెబ్బతియడానికి ఈ వీడియోను షేర్ చేశారు.’ అని వ్యాఖ్యానించారు.
అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం సీసీ టీవీ పుటేజ్ పరిశీలించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఒకవేళ రమేష్ ఉద్దేశపూర్వకంగానే అలా చేసినట్లు తేలితే ఆయనపై చర్యలు తీసుకుంటామని పార్టీ ప్రతినిధి మీడియాతో పేర్కొన్నారు. కాగా ఎమ్మెల్సీ వీణ... రమేష్పై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.