చివరి నిమిషం వరకు పిల్లలతోనే!!
భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత పిల్లలను అంతగా ప్రేమించే మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం.. చివరి నిమిషం వరకు కూడా పిల్లలతోనే గడిపారు. ఆఖరకు తన చివరి క్షణాల్లో కూడా పిల్లలను వదిలిపెట్టలేదు. షిల్లాంగ్ ఐఐఎంలో విద్యార్థుల కోసం 'లివబుల్ ప్లానెట్ ఎర్త్' అనే అంశంపై సెమినార్లో పాల్గొన్నారు. ఎప్పుడూ కలలు కనాలని, వాటిని సాకారం చేసుకోడానికి కష్టపడాలని చెప్పే కలాం.. ఏ నగరానికి ఏ కార్యక్రమం కోసం వెళ్లినా, మళ్లీ అక్కడ ఏదో ఒక విద్యాసంస్థలో తప్పనిసరిగా ఒక కార్యక్రమం పెట్టుకుంటారు.
అలా పిల్లలతో కలిసిపోయి, వాళ్లలో ఒక పిల్లాడిలా ఆయన ఆనందిస్తారు. అలాంటి కలాం లేరన్న విషయాన్ని పెద్దల నుంచి పిల్లల వరకు ఎవరూ తట్టుకోలేకపోతున్నారు. ట్విట్టర్లో సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వార్త నిజం కాకూడదంటూ చివరి నిమిషాల్లో కూడా పలువురు ట్వీట్ చేశారు. భారతదేశంలో ప్రాంతాలకు, రాష్ట్రాలకు అతీతంగా ఇంతటి అభిమానాన్ని పొందిన ఏకైక రాష్ట్రపతి కూడా అబ్దుల్ కలామే అనడంలో ఏమాత్రం సందేహం లేదు.