మరో సంచలనం: టాప్‌ హీరోయిన్‌ మేనేజర్‌ అరెస్ట్‌

టాప్‌ హీరోయిన్‌ మేనేజర్‌ అరెస్ట్‌ - Sakshi


హైదరాబాద్‌: టాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్‌ రాకెట్‌ వ్యవహారంలో మరో ప్రకంపన.. తెలుగులో టాప్‌ హీరోయిన్‌గా వ్యవహరిస్తున్న కాజల్‌ మేనేజర్‌ రోనీని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. రోనీ ఇంట్లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. రోనీ చాలాకాలంగా డ్రగ్స్‌ వాడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. గతంలో రాశీఖన్నా, లావణ్య త్రిపాఠికి కూడా రోనీ మేనేజర్‌గా వ్యవహరించాడు.



గత కొన్నిరోజులుగా డ్రగ్స్‌ కేసు టాలీవుడ్‌ను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్‌, కెమెరామ్యాన్‌ శ్యామ్‌ కే నాయుడు, నటులు సుబ్బరాజు, తరుణ్‌ సిట్‌ విచారణకు హాజరయ్యారు. తాజాగా మరో టాలీవుడ్‌ హీరో నవదీప్ సోమవారం సిట్‌ విచారణను ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకు జరిగిన సిట్‌ విచారణలో సుబ్బరాజు, తరుణ్‌ పలు విషయాలు వెల్లడించారని, టాలీవుడ్‌లో డ్రగ్స్‌ తీసుకోవడం సాధారణమే అంటూ.. డ్రగ్స్‌ విషయంలో ప్రమేయమున్న పలువురు ప్రముఖుల పేర్లను సైతం వెల్లడించారని సిట్‌ వర్గాలు మీడియాకు తెలిపాయి. ఇప్పటివరకు విచారించిన సినీ ప్రముఖుల నుంచి రాబట్టిన వివరాల ఆధారంగా మరింత లోతుగా ఈ కేసును సిట్‌ విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం హైదరాబాద్‌లో హీరోయిన్‌ కాజల్‌కు మేనేజర్‌గా ఉన్న రోనీని అరెస్టు చేశారని అంటున్నారు. సిట్‌ విచారణలో సినీ నటులు ఇచ్చిన సమాచారం ఆధారంగానే డ్రగ్స్‌ రాకెట్‌తో సంబంధమున్న మరింతమందిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top