ఐటీ చట్టానికి పదును

ఐటీ చట్టానికి పదును - Sakshi


సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ



కొత్త నేరాల నేపథ్యంలో కొత్త చట్టాలు అవసరమని వ్యాఖ్య

ఏపీలో జ్యుడీషియల్‌ అకాడమి ఏర్పాటు చేయాలని సూచన

విజయవాడలో మేధోసంపత్తి, వాణిజ్య చట్టాలపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు

సైబర్‌ చట్టాలపై అవగాహన పెంచుకోవాలి: జస్టిస్‌ లోకూర్‌

మేథో హక్కుల కోర్టులకు ప్రాధాన్యం: హైకోర్టు ఇన్‌చార్జ్‌ చీఫ్‌ జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌

అమరావతి, తిరుపతి, విశాఖలో వాణిజ్య కోర్టులు: సీఎం చంద్రబాబు




సాక్షి, అమరావతి: సైబర్‌ క్రైమ్‌ నివారణకు ఐటీ చట్టాలను మరింత పటిష్టం చేయాల్సి ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ అన్నారు. నేరాలు కొత్తగా జరుగుతున్న నేపథ్యంలో చట్టాలు కూడా అందుకనుగుణంగా కొత్తవి రావాల్సిన అవసరం ఉందన్నారు. ‘మేథో సంపత్తి, వాణిజ్య న్యాయాలు – అందుకనుగుణమైన చట్టాలు’ అనే అంశంపై శుక్రవారం నగరంలోని ఎ కన్వెన్షన్‌ హాలులో బెజవాడ బార్‌ అసోసియేషన్, ఏపీ ఆర్థికాభివృద్ధి బోర్డు, జపాన్‌కు చెందిన జెట్రో ఆధ్వర్యంలో ప్రారంభమైన రెండు రోజుల అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు.



గతంలో మారుమూల ప్రాంతాల వారికి అంతగా అవకాశాలు దక్కేవి కావని, న్యాయ వ్యవస్థలో గ్రామీణ ప్రాంత న్యాయవాదులకు సరైన గుర్తింపు రాలేదని తెలిపారు. కానీ ప్రస్తుతం అందరికీ అవకాశాలు పెరిగాయన్నారు. ఏపీలో జ్యుడీషియల్‌ అకాడమి ఏర్పాటు చేయాలని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఏపీకి చారిత్రక సంపద, సంస్కృతి ఉందని, ఎన్నో చారిత్రక ప్రదేశాలున్నాయన్నారు. విభజనకు ముందు అభివృద్ధి అంతా హైదరాబాద్‌లో కేంద్రీకృతం అయిందని చెప్పారు. సదస్సులో ఏపీ ఆర్థికాభివృద్ధి బోర్డు సీఈఓ కృష్ణకిషోర్‌ స్వాగతోపన్యాసం చేయగా, బెజవాడ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మన్మథరావు ముగింపు ఉపన్యాసం ఇచ్చారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలు, కొత్తగా హైకోర్టుకు ఎన్నికైన జడ్జిలు రజని, మురళిలను ముఖ్యమంత్రి సత్కరించారు.



ఈ కార్యక్రమంలో పాల్గొన్న న్యాయమూర్తుల ప్రొఫైల్స్‌ ఉన్న పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. రెండో సెషన్‌లో ప్రాథమిక మేధో సంపత్తి హక్కులు అనే అంశంపై జస్టిస్‌ మదన్‌ బీ లోకూర్, జస్టిస్‌ వి సుబ్రహ్మణ్యన్, జస్టిస్‌ అకిర కటసె మాట్లాడారు. డిజిటల్‌ యుగంలో వాణిజ్య కోర్టులు, ఆధారాలు అనే అంశంపై మూడో సెషన్‌లో జరిగిన చర్చలో ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్‌ ఎస్‌ మురళీధర్, కాంపిటీషన్, ఇంటర్నెట్, ఐటీ, సైబర్‌ చట్టాల గురించి నాలుగో సెషన్‌లో జరిగిన చర్చలో జస్టిస్‌ వి సుబ్రహ్మణ్యన్, ఢిల్లీ సీనియర్‌ న్యాయవాది ప్రతిభా ఎం సింగ్‌ తదితరులు మాట్లాడారు.



వాణిజ్య చట్టాలపై అవగాహన పెంచుకోండి

మారుతున్న కాలానికి అనుగుణంగా జడ్జిలం తా వాణిజ్య కోర్టులు, కాంపిటీషన్, సైబర్‌ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌ అన్నారు. దీనిపై దేశ వ్యాప్తంగా చర్చలు, వాదోపవాదాలు జరుగుతున్నా ఇంకా మీమాంస కొనసాగుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన అంశా లపై జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకో వాలని సూచించారు. వాణిజ్య కోర్టుల సామర్థ్యంపైనే ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ఆధారపడి ఉండడంతో న్యాయమూర్తులు పూర్తి స్థాయిలో ఆ అంశాలపై దృష్టి సారిం చాలన్నారు. చాలా ప్రాంతాల్లో వాణిజ్య కోర్టు లు ఏర్పాటైనా వాటిపై అధ్యయనం కేవలం ముంబై, ఢిల్లీ కోర్టులకే ఎందుకు పరిమిత మైందో అర్థం కావడం లేదన్నారు. మన దేశం కంటే ఇతర దేశాల్లో సైబర్‌ చట్టాలు బాగున్నా యని తెలిపారు. ఏపీకి ఎన్నో సవాళ్లున్నా, అనేక అవకాశాలూ ఉన్నాయని చెప్పారు. మేథో సంపత్తి హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీలోనూ కమర్షియ ల్‌ కోర్టులు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు.



కోర్టుల అవసరం ఎక్కువగా ఉంది

రాజధానిగా మారుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో కేసుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని, అందుకనుగుణంగా కోర్టుల అవసరం ఎక్కువగా ఉందని ఆంధ్రప్రదేశ్‌ – తెలంగాణ హైకోర్టు ఇన్‌చార్జ్‌ చీఫ్‌ జస్టిస్‌ రమేష్‌ రంగనాథన్‌ అన్నారు. ఐటీ, ఇంటర్నెట్‌ ఆధారంగా అన్నీ జరుగుతున్న దశలో వాణిజ్య, మేధో హక్కుల కోర్టులకు ప్రాధాన్యం ఏర్పడిందని, వాటి అవసరం ఉందని చెప్పారు. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, బయో మెడికల్‌ రంగాల రీసెర్చ్‌లో జపాన్‌ ముందుందని చెప్పారు. అందుకే అక్కడి వారికి ఆ రంగాల్లో నోబెల్‌ బహుమతులు ఎక్కువగా వస్తున్నాయన్నారు.



కొత్త చట్టాలు రావాలి

ప్రపంచమంతా డిజిటల్‌ రంగంపై ఆధారపడి పని చేస్తున్న దశలో అందుకనుగుణంగా చట్టాలు మారాలని ఢిల్లీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ జి రోహిణి చెప్పారు. న్యాయ వ్యవస్థ సైతం మారుతున్న పరిస్థితులను అన్వయించుకుని ముందుకెళ్లాల్సివుందని అభిప్రాయపడ్డారు. ఢిల్లీ, ముంబైలోనే ప్రస్తుతం వాణిజ్య డివిజన్లు ఉన్నాయని, దేశమంతా ఈ డివిజన్లు ఏర్పాటవ్వాల్సి ఉందన్నారు.



బీబీఏ మెట్రోపాలిటన్‌ బార్‌గా మారాలి

బెజవాడ బార్‌ అసోసియేషన్‌ (బీబీఏ) మెట్రో పాలిటన్‌ బార్‌గా మారాల్సిన అవసరం ఉంద ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి రామ సుబ్రహ్మణ్యన్‌ ఆకాంక్షించారు. విజయవాడ ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. లీగల్‌ వ్యవహారాలన్నీ మారుతున్నా న్యాయవ్యవస్థ మాత్రం అలాగే ఉందన్నారు. ప్రస్తుత చట్టాలు, న్యాయాలకు అనుగుణంగా జడ్జిలు, న్యాయవాదులకు శిక్షణ అవసరమని చెప్పారు.



వాణిజ్య కోర్టులతో మెరుగయ్యాం

వాణిజ్య కోర్టులు ఏర్పాటైన తర్వాత తమ దేశంలో పరిస్థితులు కొంత మెరుగుపడ్డాయని జపాన్‌ మేధో హక్కుల హైకోర్టు జడ్జి జస్టిస్‌ అకిర కటసె చెప్పారు. తమ దేశంలో 2005లో ఈ కోర్టులను ప్రారంభించామని, ప్రస్తుతం నాలుగు డివిజన్లు ఉన్నాయన్నారు. ఈ కోర్టులకు వస్తున్న కేసులు, పరిష్కరిస్తున్న విధానం గురించి ఆయన వివరించారు.



నాకు సహకరించండి: సీఎం చంద్రబాబు

అనేక సమస్యలు, సవాళ్ల నడుమ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న తనకు మద్దతు తెలపా లని ముఖ్యమంత్రి చంద్రబాబు న్యాయ మూర్తులను కోరారు. న్యాయకోవిదులు తమ వంతు సహకారం అందించాలన్నారు. సదస్సులో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన జడ్జిలనుద్ధేశించి సీఎం మాట్లాడు తూ.. అమరావతి, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లో వాణిజ్య కోర్టులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. జపాన్‌ విదేశీ వాణిజ్య సంస్థ (జెట్రో)తో కలసి పని చేయడం అభివృద్ధికి నాంది అని తెలిపారు. భారతదేశంలో ఏ రాష్ట్రానికి వెళ్లాలన్నా ఏపీని తాకకుండా వెళ్లలేని పరిస్థితులు న్నాయన్నారు. అమరావతిని గ్రీన్‌ఫీల్డ్‌ రాజధానిగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపా రు. అమరావతిలో మోడల్‌ జస్టిస్‌ సిటీ నిర్మాణం చేపట్టామన్నారు. సీఎం డ్యాష్‌ బోర్డు ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచిన వివరాలను చంద్రబాబు వీడియో ద్వారా వివరించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top