బాబూ.. మళ్లీ నాటకాలా?

బాబూ.. మళ్లీ నాటకాలా? - Sakshi


* ప్రత్యేక హోదాపైనా డబుల్ డ్రామాలొద్దు: జేపీ

* ఏడాది గడిచినా ఎందుకు తేలేకపోయారు?

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర విభజన సమయంలో ద్వంద్వ వైఖరి అవలంబించి నాటకాలాడిన తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా విషయంలోనూ అదే విధంగా వ్యవహరిస్తోందని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ విమర్శించారు. విశాఖపట్నంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చేందాలంటే పరిశ్రమలపై పన్నుల బారం తగ్గాలని, ప్రత్యేక హోదాతోనే అది సాధ్యం అవుతుందని అన్నారు.



అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తీసుకురావడంలో తెలుగుదేశంపార్టీ విఫలం అయ్యిందని అన్నారు. అయిన వారికి లబ్ధి చేకూర్చడానికే తెలుగుదేశం ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టిందని విరుచుకుపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి ఐదేళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన కేంద్రం ముష్టిలా ఏడాదికి రూ.250 కోట్లు ఇస్తూ ఉంటే ఎందుకు నిలదీయడం లేదన్నారు.



ఇంత వరకూ కేటాయించిన నిధులు మట్టి తీయడానికే సరిపోవడం లేదన్నారు.   14 వ ఆర్థిక సంఘం నిధులతో ఏపీ బడ్జెట్ లోటు భర్తీ చేసేశామని కేంద్రం చెబుతోందంటే రాష్ర్టం ఇచ్చిన నివేదికలో ఏముందో, కేంద్రంతో ఏం లాలూచీ పడిందో ప్రజలకు తెలియాలన్నారు. ఓ వైపు అప్పుల్లో ఉన్నామంటూనే ప్రత్యేక విమానాల్లో విదేశాలు తిరుగుతూ, కార్యాలయాలకూ, హంగూ ఆర్భాటాలకూ, చంద్రన్న కానుకలకూ రూ.కోట్లు ఖర్చు చేయడం ఎంత వరకు సమంజసమన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top