మళ్లీ పాక్ కాల్పుల ఉల్లంఘన, జవాన్ మృతి
జమ్మూ: పాకిస్తానీ దళాలు మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘనకు తెగబడ్డాయి. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ సరిహద్దు నియంత్రణ రేఖ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న పాక్ దళాలు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయి. గతరాత్రి పాక్ జరిపిన కాల్పుల్లో ఆర్మీ జవాన్ సిపాయి రాచ్పాల్ సింగ్ తీవ్ర గాయాలతో మృతిచెందినట్టు ఓ పోలీస్ అధికారి గురువారం వెల్లడించారు.
22 సిక్కు యూనిట్కు చెందిన రాచ్పాల్ సింగ్ పరవిందర్ పోస్ట్కు గార్డ్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. పోస్ట్ సమీపాన మాటువేసిన పాక్ దళాలు ఒక్కసారిగా కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఆర్మీ జవాన్ రాచ్పాల్ సింగ్ అసువులు బాసాడు. సరిహద్దు పరివాహక ప్రాంతాల్లో పాక్ దళాలు దాడులకు పాల్పడటం ఇది మూడోసారి. అంతకముందు కాశ్మీర్ లోయలోని నియంత్రణ రేఖ సరిహద్దు ప్రాంతాల్లో పాక్ జరిపిన కాల్పుల్లో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు మృతిచెందిన సంగతి తెలిసిందే.