ఆందోళనకరంగా విద్యాసాగర్‌రావు ఆరోగ్యం

ఆందోళనకరంగా విద్యాసాగర్‌రావు ఆరోగ్యం - Sakshi


హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సాగునీటి ముఖ్య సలహాదారు అయిన ఆర్‌.విద్యాసాగర్‌రావు ఆరోగ్య పరిస్థితి విషమించింది. రెండురోజుల కిందట కుటుంబసభ్యులు ఆయనను గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చేర్పించారు. విషయం తెలుసుకున్న ఇరిగేషన్ మినిస్టర్‌ హరీశ్‌ రావు.. ఆదివారం ఆస్పత్రికి వెళ్లి విద్యాసాగర్‌ రావును పరామర్శించి, వైద్యులు, కుటుంబసభ్యులతో మాట్లాడారు.



సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌(సీడబ్ల్యూసీ)లోనూ కీలక బాధ్యతలు నిర్వర్తించి రిటైరైన విద్యాసాగర్‌ రావు.. తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమంలో కీలక భూమిక పోషించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఆయనను కేసీఆర్‌ సర్కారు సాగునీటి ముఖ్య సలహాదారుగా నియమించింది. కాగా విద్యాసాగర్‌ రావు రెండేళ్లుగా కేన్సర్‌తో బాధ పడుతున్నారు. ఏడాది క్రితం అమెరికాకు వెళ్లి చికిత్స చేయించుకున్నారు. తిరిగి నగరానికి వచ్చినతర్వాత కూడా ఆరోగ్య పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. దాంతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆసుపత్రిలో చేర్చి కీమో థెరఫీ చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌ పెట్టి, వైద్య సేవలందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని వైద్యులు తెలిపారు.





Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top