ఇంటర్నెట్ ఇక ఆగిపోతుందా?
ప్రతివారికీ ఇప్పుడు చేతిలో ఇంటర్నెట్ లేకుండా క్షణం కూడా గడవని పరిస్థితి. సినిమా టికెట్లు బుక్ చేసుకోవాలన్నా, ప్రయాణాలు చేయాలన్నా, చివరకు క్రికెట్ స్కోరు ఎంతో తెలుసుకోవాలన్నా కూడా అరిచేతిలో ఇంటర్నెట్ ఉండాల్సిందే. కానీ, అలాంటి ఇంటర్నెట్ సామర్థ్యం కేవలం ఎనిమిదేళ్లలో నిండిపోయి, అది కుప్పకూలే ప్రమాదం ఉందని తెలుస్తోంది. మన కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, స్మార్ట్ఫోన్లు.. అన్నింటికీ నెట్ను అందించే కేబుళ్లు, ఆప్టికల్ ఫైబర్ల సామర్థ్యం ఎనిమిదేళ్లలో పూర్తిగా అయిపోతుందట. ఆ తర్వాత ఇక వాటినుంచి సమాచార ప్రసారం సాధ్యం కాదని చెబుతున్నారు. ఈ విషయం మీద లండన్లోని రాయల్ సొసైటీ ఈ నెలాఖరులో ప్రముఖ ఇంజనీర్లు, భౌతిక శాస్త్రవేత్తలు, టెలికం నిపుణులు, సంస్థలతో ఓ సమావేశం ఏర్పాటుచేసింది.
అందులో పాల్గొన్న ప్రొఫెసర్ ఆండ్రూ ఎలిస్ ఈ బాంబు పేల్చారు. రోజురోజుకూ డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోందని, దాన్ని తట్టుకోవడం అస్సలు సాధ్యం ఆకవట్లేదని ఎలిస్ చెప్పారు. రోజురోజుకూ టెక్నాలజీ విస్తరించడం, ఎక్కువ మందికి, ఎక్కువ సామర్థ్యంతో నెట్ వాడుకోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోందన్నారు.