లేడీ కాలేజీ ప్రిన్సిపాల్ గా హిజ్రా!
కోల్ కతా: భారతదేశంలో కాలేజీ ప్రిన్సిపాల్ గా బాధ్యతలు చేపట్టిన తొలి హిజ్రాగా మనాబీ బందోపాధ్యాయ్ ఘనత సాధించారు. పశ్చిమ బెంగాల్ లోని కృష్ణానగర్ మహిళా కళాశాల పిన్సిపాల్ గా బుధవారం ఆమె బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు వరకు వివేకానంద సతోబార్షికీ మహావిద్యాలయలో బెంగాలీ అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేశారు. ట్రాన్స్ జండర్... కాలేజీ ప్రిన్సిపాల్ కావడం దేశంలో కాదు బహుశా ప్రపంచంలోనే ప్రథమని తెలుస్తోంది.
అయితే మనాబీ బందోపాధ్యాయ్ నియామకం వెనుక తన ప్రమేయం ఏమీ లేదని బెంగాల్ విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీ తెలిపారు. కాలేజీ సర్వీసు కమిషన్ నిర్ణయం మేరకే ఆమెను ప్రిన్సిపాల్ గా నియమించారని వెల్లడించారు. కాలేజీని బాగా నడిపించేందుకు బలమైన వ్యక్తిత్వం కలిగిన ప్రిన్సిపాల్ ఉండాలన్న ఉద్దేశంతో బందోపాధ్యాయ్ ను ఎంపిక చేశామని మహిళా కళాశాల పాలక మండలి అధ్యక్షుడుగా ఉన్న సాంకేతిక విద్యాశాఖ మంత్రి రతన్ లాల్ హంగ్లూ తెలిపారు.
బందోపాధ్యాయ్ నియామకాన్ని కళ్యాణి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ స్వాగతించారు. కృష్ణానగర్ మహిళా కళాశాల... కళ్యాణి యూనివర్సిటీ పరిధిలోకి వస్తుంది. ఇక బందోపాధ్యాయ్ కు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తాయి.