‘అస్సలు ఊహించలేదు.. చాలా హ్యపీ’
మాండ్యా: తన చదువుకు సాయం చేయాలని కోరుతూ కర్ణాటక యువతి ఒకరు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. ఎంబీఏ చేసేందుకు తనకు విద్యా రుణం ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది. మాండ్యా జిల్లా షుగర్ టౌన్ ప్రాంతానికి చెందిన బీబీ సారా(21) ఈ మేరకు ప్రధానికి లేఖ రాసింది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన తాను ఎంబీఏ చదివేందుకు ఎడ్యుకేషన్ లోన్ కోసం బ్యాంకులను సంప్రదించానని తెలిపింది. తనకు ఆర్థిక సహాయం అందించేందుకు ఒక్క బ్యాంకు కూడా ముందుకు రాలేదని వాపోయింది.
ప్రధానికి సారా లేఖ రాసిన పదిరోజుల తర్వాత ఆమెకు జవాబు వచ్చింది. సారాకు విద్యారుణం ఇప్పించాలని కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రధాని ఆదేశించడంతో ఆమెకు ఆగమేఘాల మీద ఆర్థిక సహాయం అందింది. విజయ బ్యాంకు ఆమెకు రూ. 1.5 లక్షలు ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేసింది.
తన కూతురు చదువుకు ఆర్థిక సహాయం అందడం పట్ల మైసూరు షూగర్ మిల్లులో పనిచేస్తున్న సారా తండ్రి సంతోషం వ్యక్తం చేశాడు. ‘నా లేఖకు ప్రధాని తప్పకుండా స్పందిస్తారని భావించాను. ఇంత తొందరగా స్పందిస్తారని ఊహించలేదు. కేవలం పది రోజుల్లోనే నాకు సమాధానం ఇచ్చార’ని సారా సంతోషంగా చెప్పింది.