షియోమి హ్యుగో ఆకస్మిక నిర్ణయం
బీజింగ్: మొబైల్ రంగంలో దూసుకుపోతున్న చైనా ఎలక్ట్రానిక్ మరియు మొబైల్ ఫోన్ తయారీ సంస్థ షియోమీకి గట్టి షాక్ తగిలింది. టెక్ దిగ్గజం షియోమి గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ హ్యుగో బర్రా అకస్మాత్తుగా రిజైన్ చేయడం కలకలం రేపింది. నిన్నగాక మొన్న (జనవరి19) తాజా స్మార్ట్ ఫోన్ రెడ్ మీ నోట్ 4 ను అట్టహాసంగా ఆవిష్కరించి అందరినీ ఆకట్టుకున్న హ్యుగో ఆకస్మిక రాజీనామా మార్కెట్ వర్గాలను విస్మయ పర్చింది. ఫిబ్రవరిలో చైనీస్ స్ప్రింగ్ ఫెస్టివల్ (నూతన సంవత్సరం) తరువాత సిలికాన్ వ్యాలీలో కొత్త సాహసయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. కంపెనీలో మూడున్నర సంవత్సరాల జైత్రయాత్రకు ముగింపు పలకడం పలువురిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.
ఫేస్ బుక్ ద్వారా తాను పదవి నుంచి వైదొలగుతున్నట్టు హ్యుగో ప్రకటించారు. మై కంఫర్ట్ జోన్ సిలికాన్ వ్యాలీనుంచి 6,500 మైళ్లు దూరంలోని షియోమికి తరలి వెళ్లినట్టు గుర్తు చేసుకున్నారు. ఈ అద్భుతమైన ఈ ప్రయాణంలోసాధించిన విజయాలకు తనకు గర్వంగా ఉందన్నారు. అలాగే షియోమి మొదటి బిడ్డను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత తనకే దక్కుతుందన్నారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా తన జీవనశైలి కారణంగా ఆరోగ్యం విషయంలో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఊహించలేదన్నారు. తన స్నేహితులు, కుటుంబ సభ్యుల కోరిక మేరకు కుటుంబానికి అత్యంత సమీపంలో ఉండే సిలికాన్ వ్యాలీలో ఉండేందుకు నిర్ణయించుకున్నట్టు చెప్పారు. త్వరలోనే తాను బీజింగ్ నుంచి తన సొంత సిలికాన్ వ్యాలీ బెంగళూరుకు వెళ్లనున్నట్టు తెలిపారు.
ఈ సందర్భంగా షియోమి వ్యవస్థాపకులు, ఉద్యోగులు, సన్నిహితులకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా సీఈవో జున్ లీ గురువు , ఒక స్నేహితుడు లాగా వ్యవహరించారని ప్రశంసించారు. ప్రపంచ టెక్ రంగంలో చైనా టాప్ ప్లేస్ లో నిలుస్తుందన్నారు. కాగా గూగుల్ లో పనిచేస్తున్న ఆయన 2013 , ఆగస్టులో షియోమిలో చేరారు.