నిలకడగా రామన్నపేట బాధితుల ఆరోగ్యం


హైదరాబాద్: నల్లగొండ జిల్లా రామన్నపేట వద్ద బుధవారం జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడి నార్కట్‌పల్లి కామినేనిలో చికిత్స పొందుతున్న మౌనిక, అక్షిత్‌లను మెరుగైన చికిత్స కోసం బుధవారం రాత్రి ఎల్‌బీనగర్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ మరొక వ్యక్తి గురువారం కామినేనిలో చేరారు. ముగ్గురి పరిస్థితి నిలకడగానే ఉందని ఆసుపత్రి వైద్యులు చెప్పారు. రామన్నపేటకు చెందిన ఎదుగాని మౌనిక (20) నగరంలోని కోఠి ఉమెన్స్‌కాలేజీలో ఎంసీఏ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.  సెలవులు ఉండటంతో బుధవారం మౌనిక రామన్నపేటలోని ఇంటికి బయలు దేరింది. బస్సు ప్రమాదంలో మౌనిక కుడి చేయి, మెడకు తీవ్ర గాయాలయ్యాయి, మెదడులో రక్తం గడ్డ కట్టిందని వైద్యులు తెలిపారు.



 నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన తోట ప్రమోద్‌కుమార్, విజయలక్ష్మి దంపతులు ఉప్పల్ బస్‌డిపో ప్రాంతంలో నివాసముంటున్నారు. విజయలక్ష్మి తోటి కోడలు రమాదేవికి బిడ్డ పుట్టడంతో పరామర్శించేందుకు తన కుమారుడు అక్షిత్ (18నెలలు)తో బయలుదేరింది. ఈ ప్రమాదంలో విజయలక్ష్మి మృతి చెందగా, అక్షిత్ ప్రాణాలతో బయటపడ్డాడు. బాబు ముఖానికి గాయాలయ్యాయని, ప్లాస్టిక్ సర్జరీ చేయాలని వైద్యులు చెప్పారు.



 ఉప్పల్ బుద్ధానగర్‌లో నివసించే ఎస్.మహేందర్‌రెడ్డి (55) బీబీనగర్ మండలం పడమట సోమారంలో గ్రామ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. విధులు ముగించుకుని నల్లగొండలోని జిల్లా  కార్యాలయానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆయనను మెరుగైన చికిత్స కోసం గురువారం ఎల్‌బీనగర్‌లో ఆసుపత్రికి తరలించారు.

 

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top