బాలుడి ప్రాణాలు తీసిన రూ. 250 బెట్టింగ్!
పిల్లలకు కూడా క్రికెట్ అంటే ఎక్కడలేని మక్కువ ఉంటోంది. కానీ, ఆ మోజు ప్రాణాలు తీసేవరకు కూడా వెళ్తోంది. ఓ మ్యాచ్ మీద రూ. 250 పందెం విషయంలో చెలరేగిన గొడవ కాస్తా.. ఒక బాలుడు తన స్నేహితుడి ప్రాణాలు తీసేవరకు వెళ్లింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లోని హౌరా జిల్లాలో జరిగింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు, మృతుడు ఇద్దరూ లిలువా పోలీసు స్టేషన్ పరిధిలోని దస్పరాలో నివసిస్తుంటారు. ఇద్దరి వయసూ 12 ఏళ్లే. ఓ క్రికెట్ మ్యాచ్ ఫలితం గురించి ఇద్దరూ రూ. 250కి పందెం వేసుకున్నారు. పందెంలో గెలిచిన కుర్రాడికి ఓడిపోయిన కుర్రాడు డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించాడు. దాంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది.
పందెం గెలిచాను కాబట్టి తనకు డబ్బులు ఇవ్వాలని తన కొడుకు అడిగాడని, కానీ ఓడిపోయిన కుర్రాడు ఒక తోటలోకి తన కొడుకును తీసుకెళ్లి ఇష్టారాజ్యంగా కొట్టాడని, తర్వాత తన కొడుకు తలను ఇటుకతో పగలగొట్టాడని బాధితుడి తండ్రి కన్హయ్యా పాశ్వాన్ తెలిపారు. ఆ తర్వాత నిందితుడు తన స్నేహితుడి మృతదేహాన్ని సమీపంలోని అడవుల్లోకి లాక్కెళ్లి, దాన్ని పొదలు, ఇటుకలతో కప్పేయడానికి ప్రయత్నించాడు. నిందితుడితో పాటు అతడి స్నేహితుడు ఒకరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఇద్దరు అబ్బాయిలలో ఒకరు బాగా భయపడి ఏడ్చి అసలు నిజం చెప్పేశాడని పోలీసులు వివరించారు. తన కొడుకు తిరిగి రాడని, కానీ హంతకుడికి మాత్రం శిక్ష పడి తీరాలని పాశ్వాన్ అంటున్నారు.