వరుడు తెనాలి.. వధువు చైనా!
కుల మతాలే కాదు, దేశాలు, సంస్కృతీ సంప్రదాయాలు కూడా వేరు. అయినా వారిద్దరూ ప్రేమలో పడ్డారు. ప్రేమకు హద్దులు, సరిహద్దులు లేవని చాటారు. పెద్దలను ఒప్పించి మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఆ దంపతులే.. గుంటూరులోని తెనాలికి చెందిన వరుణ్.. చైనాకు చెందిన యుయు. దేశాలు, సంస్కతీ సంప్రదాయాలు వేరైనా భారతీయ యువకుడు వరుణ్, చైనా యువతి యుయు మనసిచ్చిపుచ్చుకున్నారు. గత గురువారం తిరుమల తిరుపతి దేవస్థానంలో వీరి పెళ్లి హిందూ సంప్రదాయ పద్ధతిలో ఘనంగా జరిగింది.
ప్రేమకథ ఎలా మొదలైందంటే..
ప్రపంచ దేశాల సంస్కతీ సంప్రదాయాలను అధ్యయనం చేయడానికి మన దేశం నుంచి వంద మందితో కూడిన ఓ బృందం చైనాను సందర్శించింది. ఈ బృందంలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వరుణ్ కూడా ఉన్నాడు. చైనా ప్రజల జీవన విధానాన్ని అధ్యయనం చేయడానికి వీళ్లకి ఒక్కొక్కరికి ఒక్కొక్క చైనీస్ కుటుంబాన్ని కేటాయించారు. ఇందులో భాగంగా వరుణ్ యుయు ఇంట్లో బస చేశాడు. ఈ క్రమంలో యుయుకు వరుణ్ మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. 2014లో యుయు ఇండియా వచ్చి తెనాలిలోని వరుణ్ కుటుంబసభ్యులతో కొన్ని రోజులు గడిపి వెళ్లింది. ఆ తరువాత ఇరువైపుల పెద్దలు వీరి పెళ్లికి ఒప్పుకున్నారు. జర్మనీలో పి.హెచ్.డి చేస్తున్న వరుణ్ తన చదువు పూర్తవుడంతో గురువారం తిరుమల తిరుపతి దేవస్థానంలో సంప్రదాయబద్ధంగా యుయుని వివాహం చేసుకున్నాడు. పూర్తిగా హిందూ సంప్రదాయంలో జరిగిన ఈ పెళ్లిలో యుయు కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొని వధూవరులను దీవించారు.