ఆగంతకుడి కాల్పులు: ముగ్గురు పోలీసుల మృతి
కరాచీ: పాకిస్థాన్లోని కరాచీలో బంగోరియా గొతి ప్రాంతంలో బుధవారం వాహనాలే లక్ష్యంగా చేసుకుని ఆగంతకుడు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి చెందారు. మరో పోలీసు తీవ్రంగా గాయపడ్డాడని ఉన్నతాధికారులు వెల్లడించారు. క్షతగాత్రుడ్ని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కాల్పుల అనంతరం ఆగంతకుడు పరారైయ్యాడని చెప్పారు. మృతుల్లో ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నారని పేర్కొన్నారు. నిందితుడి కోసం భద్రత దళాలు గాలింపు చర్యలు చేపట్టాయని వివరించారు. అయితే ఈ దాడికి తామే పాల్పడ్డామని ఇంత వరకు ఏ సంస్థ ప్రకటించలేదన్నారు.
కాగా ఈ ప్రాంతంలో తాలిబన్ల ప్రాబల్యం అధికంగా ఉందని ఆయన గుర్తు చేశారు. భద్రత సిబ్బంది మంగళవారం తీవ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టింది. ఈ సమయంలో భద్రత దళాలు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మరణించారు. వారిలో నలుగురు తాలిబాన్ తీవ్రవాదులు ఉన్నారు. నిన్న జరిగిన కాల్పుల ఘటనకు ప్రతిస్పందనగా ఈ కాల్పులు జరిగి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ కాల్పులపై సింధు హోం మంత్రి సోహల్ అన్వర్ విచారణకు ఆదేశించారు.