ఎంఎన్పీ గడువు దాటితే టెల్కోలపై చర్యలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పూర్తి స్థాయి మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్పీ)ని గడువు తేదీలోగా (మే 3) అమలు చేయని పక్షంలో టెల్కోలపై చర్యలు తప్పవని టెలికం శాఖ కార్యదర్శి రాకేశ్ గర్గ్ చెప్పారు. ఇప్పటికే టెల్కోలకు ఆరు నెలల పాటు తగినంత సమయం ఇచ్చామన్నారు. సాధ్యపడదని టెల్కోలు చెప్పడానికి.. ఎంఎన్పీని ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి కాదని చెప్పారు. ఇప్పటికే అమల్లో ఉన్న దాన్ని దేశవ్యాప్తంగా మాత్రమే విస్తరిస్తున్నామని ఆయన వివరించారు. సాంకేతికపరమైన ఇబ్బందుల కారణంగా గడువులోగా పూర్తి స్థాయి ఎంఎన్పీ అమలుపర్చలేకపోవచ్చని, దీన్ని మరికాస్త పొడిగించాలంటూ సెల్యులార్ ఆపరేటర్ల అసోసియేషన్ సీవోఏఐ ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో గర్గ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
మరోవైపు జమ్మూకశ్మీర్లో, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రీ-పెయిడ్ మొబైల్ సర్వీసులను మరో రెండేళ్ల పాటు పొడిగించాలని కేంద్రం నిర్ణయించినట్లు గ ర్గ్ చెప్పారు. ఎంఎన్పీ సౌలభ్యం వల్ల మొబైల్ యూజర్లు.. పాత నం బరును మార్చుకోవాల్సిన అవసరం లేకుండా ఆపరేటరును మార్చుకోవచ్చు. ప్రస్తుతం ఒక టెలికం సర్కిల్లో ఆపరేటర్లను మాత్రమే మార్చుకునేందుకు వీలుంది. మరో సర్కిల్లో ఆపరేటరుకు మారే వెసులుబాటు లేదు. దీన్ని దేశవ్యాప్తంగా అన్ని సర్కిళ్లకు వర్తింపచేసేందుకే పూర్తి స్థాయి ఎంఎన్పీని ఉద్దేశించారు.
శ్రీసిటీలో కోల్గేట్ టూత్బ్రష్ల యూనిట్ ప్రారంభం
న్యూఢిల్లీ: దంత సంరక్షణ తదితర ఉత్పత్తుల తయారీ సంస్థ కోల్గేట్ పామోలివ్ తాజాగా చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ సెజ్లో టూత్బ్రష్ల తయారీ యూనిట్ను ఏర్పాటు చేసింది. దీని వార్షిక సామర్థ్యం 22 కోట్ల బ్రష్లని సంస్థ పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి ఉత్పత్తి ప్రారంభం అవుతుందని బీఎస్ఈకి తెలిపింది. మరోవైపు హిమాచల్ప్రదేశ్లోని బడ్డీలో ఉన్న ప్లాంటుకు పదేళ్ల మినహాయింపు గడువు ముగిసిపోతుండటంతో ఇకపై ఎక్సయిజ్, ఆదాయ పన్ను సహా అన్ని ట్యాక్సులు కట్టనున్నట్లు కోల్గేట్ పామోలివ్ పేర్కొంది. సోమవారం బీఎస్ఈలో కంపెనీ షేర్లు 1.16% పెరిగి రూ.2,025 వద్ద ముగిశాయి.