ఏమనుకున్నావ్‌.. అంతుచూస్తా!

ఏమనుకున్నావ్‌.. అంతుచూస్తా! - Sakshi


ప్రభుత్వ అధికారులంటే చంద్రబాబుకు ఎప్పుడూ చులకనే..

అధికారంలో ఉన్నా.. లేకున్నా.. అధికారులపై చిందులు

చంద్రబాబు నోటి దురుసుతో ప్రాణాలు కోల్పోయిన అధికారి

అసెంబ్లీ ఆవరణలోనే డీసీపీపై చిందులు

విజయనగరం ఎస్పీకి బెదిరింపులు.. ఏపీ భవన్‌ అధికారిపై దుర్భాషలు

మహారాష్ట్రలోనూ కొనసాగిన తిట్లపురాణం

తాజాగా గురివింద నీతి వల్లె వేయడంపై ప్రభుత్వ అధికారుల అసహనం  




సాక్షి, అమరావతి: ‘ఏం పిచ్చపిచ్చగా ఉందా? తమాషాలు చేస్తున్నారా? మేం అధికారంలోకి వస్తే మీ అంతుచూస్తా! ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి. ఎవరనుకున్నావ్‌ నన్ను. యూజ్‌లెస్‌ ఫెలో.. తాట తీస్తా.. నీ ఉద్యోగం ఊడగొడతా..!’ ఇవి పలు సందర్భాల్లో ప్రభుత్వ అధికారులపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్లో మచ్చుకు కొన్ని. అధికారంలో ఉన్నా.. లేకున్నా.. ఈ తరహా మాటలు ఆయనకు సర్వసాధార ణమని అధికారవర్గాలే పేర్కొంటున్నాయి. నందిగా మ బస్సు దుర్ఘటన నేపథ్యంలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ లక్ష్యంగా ఉద్యోగ సంఘాలను సీఎం  రంగం లోకి దించారు. ప్రతిపక్ష నేతను తప్పుబడుతూ పత్రికా ప్రకటనలు ఇవ్వాలని ఆదేశించారు.



ఈ సందర్భంగా గతంలో ప్రభుత్వ ఉద్యోగులపై చంద్రబాబు దురుసుగా మాట్లాడిన తీరును, దుర్భాషలాడిన సంద ర్భాలను అధికారులు   గుర్తుచేస్తూ.. ప్రస్తుత వ్యవహా రంలో బాబు ప్రభుత్వం గురవింద నీతిని వల్లెవేస్తోం దన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ట్రావెల్స్‌ యజమాని తన పార్టీ ఎంపీ కావడంతో ఆధారాలు బూడిద చేసే ప్రయత్నం చేస్తున్నారనేది ప్రజల అనుమానం. ఈ అభిప్రాయాన్నే ప్రతిపక్ష నేత వెల్ల డించే ప్రయత్నం చేసి ఉండొచ్చని, పోస్టుమార్టం జరు గుతున్న తీరును తెలుసుకోవాలని ఆయన అనుకొని ఉండొచ్చని ఉద్యోగ వర్గాలు అంటున్నాయి.



అయితే దీనికి కౌంటర్‌గా తమచేత పత్రికా ప్రకటనలు ఇప్పిం చి, ఇబ్బంది పెట్టడమేమిటని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతెందుకు జన్మభూమి సభల్లో ప్రజల ఎదుట తమను పురుగుల్లా చిత్రీకరించే యత్నాలు ఎన్నిసార్లు చేయలేదు? అని వారు ప్రశ్నిస్తు న్నారు. రాష్ట్రంలోనే కాదు.. రాజకీయ లబ్ధి కోసం మహారాష్ట్ర పోలీసులతోనూ వాగ్వాదానికి దిగి, వారిని కూడా నోటికొచ్చినట్టు మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని చంద్రబాబుకు సూచిస్తున్నారు. ఇసుక మాఫియాను అడ్డుకున్న అధికారిణిపై టీడీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం చేసినా.. మహిళా అధికారిణినే మందలిం చిన తీరును ఏమంటారని వారు ప్రశ్నిస్తున్నారు. సాక్షాత్తూ అసెంబ్లీ ప్రాంగణంలోనే తన ఎల్లో మీడియాకు అడ్డుపడ్డారంటూ పోలీసులను నోటికొచ్చి నట్టు మాట్లాడిన ఘటనలను పోలీస్‌ అధికారులు గుర్తుచేస్తున్నారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగులపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్లో కొన్ని..



1999 మార్చి...: నీటిపారుదల శాఖ సమీక్షలో ఎస్‌ఈ అప్పారావుపై బాబు నిప్పులు చెరిగారు. ఆయన్ని తీవ్రంగా అవమానించారు. దీంతో మానసిక క్షోభకు గురైన ఆయన గుండెపోటుకు గురై ప్రాణాలే కోల్పోయారు.

2004లో..: అనంతపురం జిల్లా కనగానపల్లి ఎంపీపీ తగరకుంట ప్రభాకర్‌ హత్యకు గురైన సందర్భంలో ఎస్పీ కార్యాలయం ఎదుట టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా అప్పటి ఎస్పీ అనిల్‌కుమార్‌ను ఉద్దేశించి ‘అధికార పార్టీకి తొత్తుగా ఉన్నావు.. హత్య జరుగుతుంటే ఏం చేస్తున్నావ్‌..’ అంటూ చంద్రబాబు ఇష్టానుసారం తిట్టారు.

2005 జనవరి 24: పరిటాల రవి హత్య సందర్భంగా అప్పటి ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌ను ‘తాట తీస్తా... నీ ఉద్యోగం ఊడగొడతా’ అంటూ దుర్భాషలాడారు.

2003లో..: విజయనగరంలో పర్యటన సందర్భంగా మహిళా కమిషనర్‌ను ‘యూజ్‌లెస్‌ ఫెలో..! స్టుపిడ్‌’ అంటూ సస్పెండ్‌ చేస్తానని బెదిరించారు.

2010 జూలై 20: బాబ్లీ ప్రాజెక్టును అడ్డుకునేందుకు వెళ్ళిన చంద్రబాబు బృందాన్ని అడ్డు కున్న మహారాష్ట్ర పోలీసులపై ‘మీ వ్యవహారశైలి ఇంతేనా? బిచ్చగాళ్ల కన్నా హీనంగా చూస్తున్నారు. నేను తొమ్మిదేళ్లు సీఎంగా చేశాను. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నాను. వీళ్లంతా ఎమ్మెల్యేలు, ఎంపీలు. కనీస మర్యాద కూడా ఉండదా?.. చూస్తాం! (వేలితో హెచ్చరిస్తూ)

2012 ఏప్రిల్‌ 24: విజయనగరం జిల్లా కలెక్టరేట్‌ వద్ద టీడీపీ చేపట్టిన ధర్నా సంద ర్భంగా జిల్లా ఎస్పీ కార్తికేయను ఉద్దేశించి.. ‘ఏంటి ఎస్పీ! ఎవరనుకుంటున్నావ్‌ నన్ను? కాంగ్రెస్‌ తొత్తులా ప్రవర్తిస్తున్నావ్, మా ప్రభుత్వం వస్తే నువ్వు ఎక్కడుం టావో గుర్తుంచుకో.. ఇబ్బందుల్లో పడతావు..’

► ‘ఏంటిది? నేను వ్యక్తిని కాదు. ఒక వ్యవస్థను. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతను. మండలిలో ప్రతిపక్ష నేత కూడా ఇక్కడే ఉన్నారు. మా వాహనాలను అడ్డుకుంటారా? అసలు మీ డ్యూటీ ఏంటి..?’

2013 ఆగస్టు 3: అసెంబ్లీ ఆవరణలో మీడియా ప్రతినిధిని అడ్డుకున్నందుకు హైదరాబాద్‌ సెంట్రల్‌ జోన్‌ డీసీపీ హరికుమార్‌ను ఉద్దేశించి ‘ఏం పిచ్చపిచ్చగా ఉందా? తమాషా చేస్తున్నారా? ఇది అసెంబ్లీ అనుకున్నారా లేక పోలీసు రాజ్యం అనుకున్నారా? అసెంబ్లీ అయిపోయిన తర్వాత కూడా మేం ఎక్కడ మాట్లాడాలో మీరే నిర్దేశిస్తారా? ఎంత వరకూ ఉండాలో అంత వరకు ఉండండి. ఎక్కువ చేస్తే అంతు తేలుస్తాం. మీరు ఎంతసేపు చెబితే అంతసేపు మేం నోర్మూసుకొనే కూర్చోవాలా? ఇదేమైనా ఎమర్జెన్సీయా..?’

2013 జూన్‌ 26: ఉత్తరాఖండ్‌ వరద బాధితులను పరామర్శించి అటు నుంచి ఢిల్లీలోని ఏపీ భవన్‌కు చేరుకుని  రెసిడెంట్‌ కమిషనర్‌ శశాంత్‌ గోయల్‌పై.. ‘మీకు మానవత్వం ఉందా? ఏపీ భవన్‌ గెస్ట్‌హౌస్‌ కాదు. ఎవరు నేర్పారయ్యా.. ఏం ఎమ్మెల్యేలు వస్తే రూములు తీయడం తెలియదా? మీ మీద చర్య తీసుకోవాలి’

2016 జూన్‌ 1: కృష్ణా జిల్లా పెనగంచిప్రోలులో జరిగిన జన్మభూమి కార్యక్రమం సందర్భంగా వేదికపైకి పిలిచి జాయింట్‌ కల్టెకర్‌పై సీఎంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు... ‘ఏయ్‌ నువ్వు ఏం చేస్తున్నావ్‌.. ఏం తమాషాగా ఉందా? ఇదేం అడ్మినిస్ట్రేషన్‌. ఇక్కడ రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు? ఏయ్‌ జేసీ చంద్రుడు. నువ్వేం చేస్తున్నావ్‌? నేను ఎవర్నీ వదిలిపెట్టను!’

2016 మార్చి 21: ఆర్థిక శాఖ అధికారిని సచివాలయానికి పిలిపించుకున్న బాబు  ఆగ్రహంతో ఊగిపోతూ.. ‘ఏం.. పిచ్చపిచ్చగా ఉందా? తమా షాలు చేస్తున్నారు? ప్రతీ ఫైల్‌లో ఇష్టానుసారంగా రాస్తారా? ఇలాగైతే పరిపాలన ఎలా చేయాలి?’



అధికారిణిపై చేయిచేసుకున్నా.. పట్టించుకోలేదే!

– ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్‌ వనజాక్షి ప్రయత్నించారు. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఆమెపై దౌర్జన్యం చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రభుత్వ అధికారుల్లో ఆందోళన కలిగించింది. ఈ ఘటనలో అధికారిణికి అండగా నిలబడాల్సిన చంద్రబాబు ప్రభుత్వం మహిళా అధికారిణిపైనే ఆగ్రహం వ్యక్తం చేయడం.. కక్ష సాధింపుగా వ్యవహరించడం ప్రభుత్వ తీరుకు అద్దంపడుతోంది.

– కొల్లేరు రోడ్డు విషయంలో అడ్డుపడ్డ అటవీ శాఖ అధికారిని దెందులూరు ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్‌ బెదిరించాడు. ఈ విషయం తెలిసినప్పటికీ తన శాసనసభ్యుడిని అదుపులో పెట్టాల్సిన చంద్రబాబు... అటవీ అధికారినే మందలించాడు.



అధికారంలోకి వస్తే ఫుట్‌బాల్‌ ఆడుకుంటా..!

కోడుమూరు: 1993లో ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కోడుమూరు వచ్చిన చంద్రబాబు.. అప్పటి స్థానిక ఎస్‌ఐ పీఎన్‌ బాబును దూషించారు. తాను అధికారంలోకి వస్తే ఫుట్‌బాల్‌ ఆడుకుంటానని హెచ్చరించారు. అన్నట్లుగానే అధికారంలోకి వచ్చిన తరువాత 1995లో పీఎన్‌ బాబును రైల్వే డిపార్ట్‌మెంట్‌కు బదిలీ చేయించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top