ప్రమాదంలో పాలకొల్లు వాసులు?
నేపాల్ భూకంపంలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పలువురు కూడా చిక్కుకున్నట్లు తెలుస్తోంది. పాలకొల్లుకు చెందిన హనుమాన్ సత్యసాయి ట్రావెల్స్ ఆధ్వర్యంలో మొత్తం 45 మంది నేపాల్ పర్యటనకు వెళ్లారు. వీళ్లలో 34 మంది ఉభయ గోదావరి జిల్లాలకు చెందినవారు కాగా, మరో 11 మంది శ్రీకాకుళం జిల్లాకు చెందినవాళ్లు. వీరంతా ఈనెల 15వ తేదీన నేపాల్కు పయనమయ్యారు. శనివారం నాడు అక్కడి పశుపతినాథ్ ఆలయానికి వెళ్తున్నట్లు కూడా వీరి నుంచి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.
అయితే, వీరు తిరిగి వచ్చే సమయానికి భూకంపం సంభవించడం.. ఆ తర్వాతి నుంచి అక్కడ సమాచార వ్యవస్థ మొత్తం స్తంభించడంతో వీరి క్షేమ సమాచారంపై ఆందోళన వ్యక్తమవుతోంది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన వారు పలువురు ఈ యాత్రలో ఉన్నారు. 11 మంది మాత్రం శ్రీకాకుళం జిల్లావారు. వీరేమయ్యారోనని కుటుంబసభ్యులంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు.