5 నిమిషాలు సమయమివ్వండి
అమరావతి పర్యటనపై ప్రధానికి ఏపీ కాంగ్రెస్ ఎంపీల లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: అమరావతి శంకుస్థాపనకు వస్తున్న సందర్భంలో ఏపీ ప్రజల ఆశలు, ఆకాంక్షలు వ్యక్తపరిచేందుకు వీలుగా తమకు ఐదు నిమిషాలు అపాయింట్మెంట్ ఇవ్వాలని కాంగ్రెస్కి చెందిన రాజ్యసభ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. చిరంజీవి, కేవీపీ రాంచంద్రరావు, సుబ్బిరామిరెడ్డి, జైరాం రమేశ్లతో కలిసి ప్రధానికి లేఖ రాసినట్టు జేడీ శీలం మంగళవారం తెలిపారు.
‘ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీలు, యూపీఏ కేబినెట్ ప్రత్యేక హోదాపై చేసిన తీర్మానం అమలైతే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకూ బలమైన పునాది ఏర్పడుతుంది. తిరుపతి, విశాఖపట్నం పర్యటన సందర్భంగా గతంలో మీరు కూడా ఈ హామీలను నెరవేరుస్తానన్నారు. మీరు రాజధానికి శంకుస్థాపన చేసే తరుణంలో ప్రత్యేక హోదాపై, ప్రత్యేక ప్యాకేజీపై ప్రకటన చేస్తారని భావిస్తున్నాం.’ అని లేఖలో పేర్కొన్నారు.