బ్యాండ్ వాయించడానికి వచ్చి..

బ్యాండ్ వాయించడానికి వచ్చి..


జనరేటర్‌ పొగతో నలుగురి మృతి!

కర్ణాటకలోని లింగసూగూరులో ఘటన



లింగసూగూరు (కర్ణాటక):


పెళ్లిలో బ్యాండ్ వాయించి నాలుగు డబ్బులు సంపాదించుకుందామని వచ్చిన నలుగురు యువకులు.. జనరేటర్‌ పొగ కారణంగా ఊపిరాడక దుర్మరణం చెందారు. ఈ ఘటన గురువారం రాత్రి కర్ణాటకలోని రాయచూరు జిల్లా లింగసూగూరులో చోటు చేసుకుంది. మృతులను లింగసూగూరు మునిసిపాలిటీ పరిధిలోని కరడకల్‌ గ్రామానికి చెందిన శశికుమార్‌ (17), ఆదెప్ప (19), మౌలాలి (18), మంజునాథ్ ‌(20)గా గుర్తించారు. వీరితో పాటే నిద్రించిన సురేష్‌ (21) అనే యువకుడు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో బాగలకోటె జిల్లా ఆస్పత్రికి తరలించారు.



లింగసూగూరులోని చేతన్‌ సౌండ్‌ సర్వీస్‌లో పనిచేసే వీరంతా గురువారం ఆనేహొసూరులో జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యారు. రాత్రి పొద్దుపోయాక లింగసూగూరుకు తిరిగొచ్చారు. తెల్లవారిన తర్వాత ఇళ్లకు వెళ్దామనుకుని తమ బ్యాండ్‌ కార్యాలయం (చిన్నపాటి గది)లో నిద్రించారు. ఆ గది సెల్లార్‌లో ఉంటుంది. కనీసం కిటికీలు కూడా లేవు. గది షట్టర్‌ మూసేసుకున్నారు. విద్యుత్‌ లేకపోవడంతో జనరేటర్‌ ఆన్‌ చేశారు. వారు నిద్రలోకి జారుకున్న తర్వాత గది మొత్తం జనరేటర్‌ పొగ కమ్ముకుంది. గాఢనిద్రలోనే ఊపిరాడక నలుగురూ మృతి చెందారు. సురేష్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. శుక్రవారం ఉదయం ఈ ఘటన వెలుగు చూడటంతో అదనపు జిల్లా ఎస్పీ ఎస్‌బీ పాటిల్, డీఎస్పీ శరణ బసప్ప, సీఐ వీరభద్రయ్య తదితరులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top