ఆ పోరాటం ఐదు కోట్ల మంది ఆకాంక్ష
జగన్కు సంఘీభావం ప్రకటించిన మంద కృష్ణమాదిగ
అరండల్పేట (గుంటూరు): ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్కాంగ్రెస్పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష ఐదుకోట్ల మంది ప్రజల ఆకాంక్ష అని, ఆయన పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. దీక్షా స్థలిలో జగన్మోహన్రెడ్డిని గురువారం మంద కృష్ణ కలిసి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం ప్రత్యేక హోదాపై స్పష్టమైన ప్రకటన చేసే వరకు జగన్ దీక్షకు తమ మద్దతు ఉంటుందన్నారు. అలాగే వైఎస్సార్సీపీ భవిష్యత్తులో చేపట్టే పోరాటాల్లో క్రియాశీలక భాగస్వాములవుతామని తెలిపారు.
సంకుచితమైన విమర్శలు మానాలి..
జగన్ దీక్షపై మంత్రులు, టీడీపీ నాయకులు సంకుచితమైన మనస్తత్వంతో విమర్శలు చేస్తున్నారని, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. ఓటుకు కోట్లు కేసులో పీకల్లోతు కూరుకు పోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు జైలుకు వెళతాననే భయంతోనే ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం వద్ద ప్రస్తావించడం లేదని మందకృష్ణ ఆరోపించారు.