ఆర్టీవోపై దాడి.. మంత్రిపై కేసు నమోదు
ప్రాంతీయ రవాణా అధికారి (ఆర్టీవో)పై దాడి చేయడంతో పాటు ఆయనను బెదిరించినందుకు ఉత్తరప్రదేశ్ మంత్రి కైలాష్ చౌరాసియాపై కేసు నమోదైంది. ఆయన ఆ రాష్ట్ర బాలల పౌష్ఠికాహారం, ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాల మేరకు ఈ దాడి ఘటనపై కట్రా కొత్వాలీ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలైంది. ఆర్టీవో చిన్నిలాల్ - మంత్రి మధ్య వివాదం గత నెలలో జరిగింది.
జూన్ 12వ తేదీన మంత్రి తనను ఆయన కార్యాలయానికి పిలిపించుకున్నారని, ఆర్టీవో కార్యాలయంలో ఒక క్లర్కును చేర్చుకోవద్దని చెప్పారని చిన్నిలాల్ అన్నారు. అయితే, ఈ విషయంలో హైకోర్టు ఉత్తర్వులు ఉన్నందువల్ల అతడిని తప్పనిసరిగా చేర్చుకోవాల్సిందేనని తాను బదులిచ్చానన్నారు. దాంతో మంత్రి, ఆయన అనుచరులు కలిసి తనను కొట్టారని, చంపేస్తామంటూ బెదిరించారని చెప్పారు. దీనిపై జూన్ 20న కోర్టులో ఫిర్యాదుచేయగా, కేసు నమోదు చేయాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు.