పాఠశాలలోనే ప్రాణం తీశాడు
* స్కూల్లో కొట్టుకున్న ఇద్దరు విద్యార్థులు
* సున్నితమైన ప్రాంతంలో తగలడంతో ఒకరి మృతి
హైదరాబాద్: పాఠశాలలో బుద్ధిగా చదువుకోవాల్సిన విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో అనుకోని ఘోరం జరిగిపోయింది. సున్నితమైన ప్రాంతంలో దెబ్బ తగలడంతో ఓ విద్యార్థి మృత్యువాత పడ్డాడు. హైదరాబాద్ కింగ్కోఠిలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. మాసబ్ట్యాంక్కు చెందిన విద్యార్థి మహ్మద్ అబేర్ సిద్ధిఖీ (14), చాదర్ఘాట్ అజంపురాకు చెందిన సిరిల్(14)లు సెయింట్ జోసెఫ్ స్కూల్లో 10 వ తరగతి చదువుతున్నారు.
మంగళవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. పాఠశాల సీసీ పుటేజీలో కూడా వీరి ఘర్షణ రికార్డు అయినట్లు తెలుస్తోంది. అయితే గొడవ సందర్భంగా ఇద్దరూ ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఈ క్రమంలో సిరిల్... సిద్ధిఖీ మెడపై బలంగా కొట్టడంతో అతడు ఒక్కసారిగా కుప్పకూలాడు. ఆలస్యంగా గమనించిన పాఠశాల సిబ్బంది అక్కడే ప్రథమ చికిత్స చేసి, సమీపంలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. మెడలో నరాలు చిట్లిపోవడంతో డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. బుధవారం ఉదయం సిద్ధిఖీ తుదిశ్వాస విడిచాడు. ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు సిద్ధిఖీ మృతదేహాన్ని మాసబ్ట్యాంక్లోని అతడి తాతయ్య ఇంటికి తరలించారు. సిద్ధిఖీ చెల్లెలు కూడా ఇదే పాఠశాలలో చదువుతున్నట్లు తెలిసింది.
పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంపై ఆగ్రహం
యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే సిద్ధిఖీ మృతిచెందినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల మధ్య ఘర్షణకు కారణమేంటి అనేదానిపై ఇప్పటికీ పాఠశాల సిబ్బంది నోరు మెదపడం లేదు. ఘర్షణ సంఘటన, విద్యార్థి అపస్మారక స్థితిపై యాజమాన్యం నుంచి పోలీసులకు ఇప్పటి వరకు ఫి ర్యాదు అందకపోవడం గమనార్హం. మధ్య మండలం డీసీపీ కమలాసన్రెడ్డి, అబిడ్స్ ఏసీపీ రాఘవేంద్రరెడ్డి సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు.సీసీ ఫుటేజీని ఎఫ్ఎస్ఎల్కు పంపించినట్లు నారాయణగూడ ఎస్సై కవియుద్దీన్ తెలిపారు. సిరిల్పై కేసు నమోదు చేశామని, రేపటిలోగా అతడిని అరెస్టు చేస్తామని చెప్పారు.