ఎన్నారైల హత్య.. వివాహేతర సంబంధమే కారణమా?
అమెరికాలో తల్లీ కొడుకులను ఎవరో దారుణంగా హతమార్చారు. ఈ ఘటన తీవ్రంగా కలకలం రేపింది. అయితే, ఈ ఘటన వెనుక మరో కోణాన్ని మృతురాలి తల్లిదండ్రులు బయటపెడుతున్నారు. తమ అల్లుడు నర్రా హనుమంతరావుకు అమెరికాలో మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని, అందువల్ల అతడే తమ కూతురిని, మనవడిని హతమార్చి కట్టుకథలు చెబుతున్నాడని ఆరోపించారు. విజయవాడలో ఉంటున్న శశికళ తల్లిదండ్రులు ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
న్యూజెర్సీలోని బర్లింగ్టన్లో నివాసం ఉంటున్న శశికళ (40), కుమారుడు అనీష్ సాయి (7) హత్యకు గురయ్యారు. వారిద్దరినీ ఎవరో గొంతు కోసి చంపేశారు. శశికళ భర్త నర్రా హనుమంతరావు గత 12ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. శశికళ కూడా సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నారు. వీరికి 14 ఏళ్ల క్రితం పెళ్లయింది. తొమ్మిదేళ్లుగా అమెరికాలో ఉంటున్నారు. హనుమంతరావు ఓ కంపెనీలో అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తుండగా.. శశికళ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. (చదవండి: అమెరికాలో ఇద్దరు తెలుగువాళ్లు దారుణ హత్య! )
శశికళ బుధవారం సాయంత్రం బాబును స్కూల్ నుంచి తీసుకొచ్చారు. సాయంత్రం ఏడు గంటలకు హనుమంతరావు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి భార్య, కుమారుడు రక్తపు మడుగులో విగతజీవులుగా పడి ఉన్నారని చెప్పారు. వెంటనే తాను పోలీసులకు సమాచారం ఇచ్చానన్నారు.
అయితే, తమ అల్లుడు చెబుతున్నదంతా కట్టుకథేనని, అతడికి అక్కడ ఒక మహిళతో ఉన్న వివాహేతర సంబంధం కారణంగానే తమ కూతురిని హతమార్చాడని శశికళ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దాంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగినట్లయింది.
సంబంధిత వార్తలు