ఫేస్బుక్ పరిచయంతో.. టెకీపై అత్యాచారం
ఫేస్బుక్లో పరిచయం అయిన మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ (23)పై అత్యాచారం చేసి, ఆమెను బ్లాక్మెయిల్ చేస్తున్న కేసులో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్లోని భావ్నగర్ ప్రాంతానికి చెందిన రిషభ్ కటోడియా (25) ఇండోర్లో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అతడు తనపై అత్యాచారం చేయడమే కాక, కొన్ని నెలలుగా తనను బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటూ ఆమె ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్టు చేశారు. రిషభ్ తనకు ఫేస్బుక్లో పరిచయం అయ్యాడని, ఈ సంవత్సరం జనవరి 4వ తేదీన ఇండోర్ వచ్చి తనను సైట్ సీయింగ్కు తీసుకెళ్లాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.
అప్పుడు తనకు మత్తుమందు కలిపిన కాఫీ ఇచ్చి.. మొబైల్ఫోన్లో తనను అసభ్యంగా వీడియో తీశాడని తెలిపింది. రెండు నెలల తర్వాత తనకు ఫోన్ చేసి, వడోదరకు రాకపోతే ఆ వీడియోను ఇంటర్నెట్లో పెడతానంటూ బెదిరించాడని, అక్కడ తనపై మూడు రోజుల పాటు అత్యాచారం చేశాడని వాపోయింది. కొంతకాలం తర్వాత మళ్లీ కొన్ని అసభ్య చిత్రాలు తనకే పంపి, పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి తెచ్చాడని తెలిపింది. తాను నిరాకరించడంతో తనను చంపేస్తానని, ఆ ఫొటోలు తల్లిదండ్రులకు పంపుతానని కూడా బెదిరించాడంది. దాంతో భరించలేని బాధితురాలు.. ఇండోర్ పోలీసు స్టేషన్లో అతడిపై ఫిర్యాదు చేసింది. పోలీసులు చెప్పడంతో, ఓసారి కలవాలి ఇండోర్ రమ్మని పిలిచింది. అతడు రాగానే పోలీసులు అరెస్టు చేసి పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు.