ఎట్టకేలకు గెలిచిన న్యాయం
ఐదేళ్ల న్యాయపోరాటంతో దిగొచ్చిన బ్రిటన్లోని హోటల్ యాజమాన్యం
లండన్: హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా నష్టపోయిన ఓ భారతీయ కుటుంబానికి ఐదేళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం తగిన న్యాయం జరిగింది. ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇచ్చేందుకు బ్రిటన్లోని సదరు హోటల్ అంగీకరించింది.
2012 ఆగస్టులో బెంగళూరుకు చెందిన ఓ భారతీయ కుటుంబానికి చెందిన కల్యాణి ఉత్తమాన్ సెలవుల నిమిత్తం బ్రిటన్లోని స్కాట్లాండ్ పర్యటనకు వెళ్లింది. స్కాట్లాండ్లోని న్యూక్రెయిగ్హాల్లోని ప్రీమియర్ ఇన్ హోటల్లో బస చేసింది. స్నానం చేసేందుకు షవర్ ఓపెన్ చేయగానే అప్పటికే బాగా మరగకాగిపోయిన నీళ్లు ఆమె పై పడటంతో ఆమె శరీరం సగానికి పైగా కాలిపోయింది. శరీరంలో వివిధ అవయువాలు పూర్తిగా విఫలం కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వారం తర్వాత మరణించింది.
హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే కల్యాణి ఉత్తమాన్ చనిపోయిందని, ఆస్పత్రి బిల్లులతో కలపి నష్టపరిహారంగా భారీ మొత్తాన్ని చెల్లించాలంటూ కల్యాణి కుటుంబం కోర్టులో దావా వేసింది. కానీ, సదరు హోటల్ మాత్రం ఇందులో తమ ప్రమేయమేమీలేదని తప్పించుకుంది. ఇలా కొన్ని విచారణల అనంతరం హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఆమె చనిపోయిందన్న వాదనలతో కోర్టు ఏకీభవిస్తూ సదరు కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది.