ఎయిడ్స్పై పోరులో ముందడుగు ఆమెదే
చెన్నై: మానవ చరిత్రలో అత్యంత భయంకరమైన వ్యాధిగా భావించే హెచ్ఐవీ ఎయిండ్స్ భారత్ లోకి ప్రవేశించిన తొలి రోజులవి. తమకు సోకింది ఎయిడ్స్ అని, అది ప్రాణాంతకమైనదని, తమ ద్వారా ఇతరులకూ సోకే అవకాశం ఉందని చాలా మందికి తెలియదు. ఆ దశలో ప్రారంభమైంది సునితి సాల్మన్ ప్రస్థానం.. ఎయిడ్స్ తో పోరాటం.
భారతదేశంలో తొలిసారిగా ఎయిడ్స్ ను గుర్తించడంతో పాటు దాని నిర్మూలకు విశేష కృషి చేసిన డాక్టర్ సునితి మంగళవారం ఉదయం చెన్నైలోని తన నివాసంలో మృతిచెందారు. 1980లలో వైజీఆర్ కేర్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా హెచ్ఐవీ వ్యాప్తిపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేవారు. తమిళనాడు వ్యాప్తంగా అనేక సేవా కేంద్రాలు స్థాపించిన ఆమె మద్రాస్ యూనివర్సిటీలో మైక్రోబయాలజీ ప్రొఫెసర్ గానూ సేవలందించారు.
భారత్లో తొలి ఎయిడ్స్ కేసు..
1940 కంటే ముందే కొన్ని జంతువుల్లో హెచ్ఐవీ ఉనికిని కనిపెట్టినా.. 1980 తర్వాత గానీ అది మనుషులకు వస్తుందని తెలియలేదు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అప్రమత్తత ప్రకటించాయి. రోగసంబంధిత విషయాలను విపులీకరిస్తూ అనేక జర్నల్స్ ప్రచురితమయ్యాయి. వాటిని క్షుణ్ణంగా చదివిన డాక్టర్ సునితి సాల్మన్.. ప్రభుత్వ సాయం ఆశించకుండా స్వచ్ఛందంగా ప్రయోగాలకు సిద్ధపడ్డారు. చెన్నైలోని ఓ రెడ్ లైట్ ఏరియాలో సెక్స్ వర్కర్లుగా పనిచేసి అనారోగ్యం పాలై మైలాపూర్ లోని స్టేట్ హోంలో చికిత్స పొందుతున్న మహిళలను ఒప్పించి వారి రక్తాన్ని సేకరించి హెచ్ఐవీ టెస్టులు నిర్వహించారు. అనూహ్యంగా వారికి ఎయిడ్స్ ఉన్నట్లు తేలింది.
సెకండ్ ఒపీనియన్ కోసం శాంపిల్స్ ను వేలూరు లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీకి పంపారు. అప్పట్లో ఎలిసా టెస్టులు అక్కడ మాత్రమే అదుబాటులో ఉండేవి. తుది నిర్ధారణ కోసం అవే శాంపిళ్లను అమెరికాలోని జాన్ హోప్కిన్స్ యూనివర్సిటీ ల్యాబ్ కు పంపారు. అలా ఇండియా కూడా ఎయిడ్స్ బాధిత దేశమేనని వెలుగులోకి తెచ్చిన సుమితి.. ఆ తరువాతి కాలంలో ఎయిడ్స్ మహమ్మారిని నిర్మూలించడమే జీవితాశయంగా పనిచేశారు. డాక్టర్ సుమితి వెలుగులోకి తెచ్చిన అంశాలను గుర్తిస్తున్నట్లు తమిళనాడు శాసనసభ ఒక తీర్మానం కూడా చేసింది. 1992లో ఓ హెచ్ఐవీ పాజిటివ్ గర్భిణికి చికిత్స చేయడాన్ని డాక్టర్ సునితి తరచూ గుర్తుచేసేవారు. ఆ మహిళకు పుట్టిన ఆడపిల్ల కూడా 17 ఏళ్ల వయసులో చనిపోవడం తనను వేదనకు గురిచేసిందని చెప్పేవారు.