నోట్ల రద్దుతో మారిన అవినీతి ‘పద్దతులు’
న్యూఢిల్లీ: పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం.. రాజకీయంగా విజయవంతమైన చర్య అని ఫ్రాన్స్కు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త గై సోర్మన్ వ్యాఖ్యానించారు. అయితే ఈ నిర్ణయం అవినీతిని నిర్మూలించడంలో విఫలమైందని, ఇందుకోసం మరిన్ని చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. ‘‘నోట్ల రద్దు రాజకీయంగా విజయవంతమైంది. మెజారిటీ భారత ప్రజలు ఈ నిర్ణయాన్ని ప్రశంసించారు. అవినీతి నిర్మూలన విషయంలో తాము నిబద్ధతతో ఉన్నామని ప్రభుత్వం చెప్పుకుంది’’ అని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
‘‘మరోవైపు నోట్ల రద్దు సమయంలో వాణిజ్య లావాదేవీలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఆర్థిక వ్యవస్థ భారీగా మందగించింది. అవినీతి ఆగిపోయిందా.. అంటే కచ్చితంగా కాలేదు. అవినీతి ‘పద్దతులు’ మారిపోయాయి అంతే’’ అని వివరించారు. ‘‘అవినీతి నిర్మూలనకు ప్రభుత్వం గట్టి చర్యలేవీ తీసుకోలేదు. ఆర్థిక వ్యవస్థ వృద్ధి కంటే.. రాజకీయంగా లబ్ధి పొందేందుకే ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తి చూపిస్తున్నట్లు కనిపిస్తోంద’’ ని విమర్శించారు. నల్లధనం, నకిలీ నోట్లు, అవినీతిని నిర్మూలించేందుకంటూ.. గతేడాది నవంబర్లో పాత రూ.500 రూ.1,000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే.