స్కూల్ వాష్రూమ్లో టీచర్ను బంధించి..
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. తూర్పుఢిల్లీలోని వికేక్ విహార్ ప్రాంతంలోని 'సర్వోదయ విద్యాయ్' స్కూల్లో టీచర్గా పనిచేస్తోన్న మహిళ(44)కు దారుణ అనుభవం ఎదురైంది. టీచర్ వాష్రూమ్కు వెళ్లడం గమనించిన ఒకడు.. బయటి నుంచి గడియ పెట్టాడు. తలుపు తీసేందుకు ప్రయత్నించిన టీచర్ను..'చెప్పినట్లు వింటేనే తలుపు తెరుస్తా..'అని బెదిరించాడు. కొద్ది నిమిషాల టెన్షన్ తర్వాత 'మాట వింటానని' టీచర్ చెప్పడంతో వాడు తలుపు తీశాడు. బయటికి వస్తూనే బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో ఆ వ్యక్తి పరారయ్యాడు. సంచలనం రేపిన ఈ ఘటనపై స్కూల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదుచేసింది.
తనను గదిలో బంధించింది స్కూల్ యూనిఫాంలో ఉన్న విద్యార్థేనని టీచర్ చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. పోలీసులు.. విద్యార్థులను వరుసలో నిలబెట్టగా, బాధిత టీచర్ మాత్రం నిందితుణ్ని గుర్తుపట్టలేకపోయింది. టెన్షన్లో చూడటంమూలాన అతని ముఖం సరిగా గుర్తులేదని టీచర్ పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై ఓ కమిటి వేసినట్లు స్కూల్ యాజమాన్యం ప్రకటించింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితుణ్ని త్వరలోనే పట్టుకుంటామని అన్నారు.