మాజీ ముఖ్యమంత్రికి తాత్కాలిక రిలీఫ్‌

మాజీ ముఖ్యమంత్రికి తాత్కాలిక రిలీఫ్‌ - Sakshi

బెంగళూర్: మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామికి న్యాయస్థానంలో తాత్కాలిక రిలీఫ్‌ దొరికింది. అక్రమగనుల తవ్వకాలకు సంబంధించి ముందస్తు బెయిల్‌ను మంజూరు చేస్తూ నగర సెషన్స్‌ కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. వివరాలు.. జంతకల్‌ మైనింగ్‌కు సంబంధించి తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాల్సిందిగా హెచ్‌.డీ కుమారస్వామి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

 

 అయితే ఆయనకు బెయిల్‌ ఇస్తే సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉందని కేసును దర్యాప్తు చేస్తున్న ‘సిట్‌’ (ప్రత్యేక దర్యాప్తు బృందం) కోర్టుకు విన్నవించింది. అయితే ఇరు వాదనలు విన్న న్యాయస్థానం కుమారస్వామికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. తన ఆదేశాలు ఈనెల 24 వరకూ అమల్లో ఉంటాయని అంతలోపు దర్యాప్తు బృందం కోరితే విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని కోర్టు సూచించింది.గనుల అక్రమ తవ్వకాల వ్యవహారంపై కుమారస్వామి, ధరమ్ సింగ్ లపై వచ్చిన ఆరోపణలపై ‘సిట్’ విచారణ జరపాలని కర్ణాటక పోలీసులను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన సంగతి తెలిసిందే.
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top