మీ వల్లే ఇబ్బందులు పడుతున్నా
నిఘా అధికారులపై సీఎం ఆగ్రహం
సాక్షి, అమరావతి: ‘ఓటుకు కోట్లు’ కేసు ముఖ్యమంత్రి చంద్రబాబును ముచ్చెమటలు పట్టిస్తోంది. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న సీఎం బుధవారం ఉదయం ఇదే అంశంపై అక్కడి నుంచే ముఖ్య నేతలు, అధికారులతో విస్తృతంగా చర్చలు జరిపారు. ఫోన్లో మంతనాలు సాగించారు. మరోవైపు ఓటుకు కోట్లు కేసు పర్యవసనాలను ముందస్తుగా కనిపెట్టడంలో విఫలమయ్యారని దాని వల్ల తాను ఇబ్బందులు పడుతున్నానని నిఘా విభాగం అధికారులపై సీఎం చిందులు వేసినట్లు అధికారుల్లో ప్రచారం జరుగుతోంది.
ఏసీబీ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువడిన రోజు రాత్రి నిఘా విభాగం చీఫ్తో పాటు ఇతర ఉన్న తాధికారులను పిలిపించుకున్న బాబు వారిపై విరుచుకుపడినట్లు తెలుస్తోంది. ‘‘రాష్ర్టంలో ఉన్న 175 మంది ఎమ్మెల్యేల కదలికలను కూడా తెలుసుకోలేకపోతున్నారు.అధికార పక్షంవారిని విడిస్తే, విపక్షంలో ఉన్నవారిలో 20 మంది మన పార్టీలోనే చేరారు, మిగిలిన 45 మంది కదలికలనూ తెలుసుకోలేకపోతున్నారా?. రాజధానికి పక్కనే ఉండే ఎమ్మెల్యే నాకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించి ఉత్తర్వులు తెచ్చుకునే వరకూ మీకు తెలియదంటే మీ పనితీరు ఎలా ఉందో అర్ధం అవుతోంది’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం.