సాఫ్ట్వేర్ ఇంజనీర్పై అత్యాచారం, హత్య: ముగ్గురికి జీవితఖైదు
టీసీఎస్లో పనిచేసే మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ను కిడ్నాప్ చేసి, ఆమెపై అత్యాచారం చేసి.. చివరకు చంపేసిన కేసులో ముగ్గురికి జీవితఖైదు శిక్ష పడింది. ఈ మేరకు చెన్నై చెంగల్పట్లోని మహిళా కోర్టు తన తీర్పు వెల్లడించింది. చెన్నై శివార్లలోని సిప్కాట్ ఐటీ పార్కులో గల టీసీఎస్ కార్యాలయంలో పనిచేసే ఉమామహేశ్వరిని ఈ సంవత్సరం ఫిబ్రవరి 13న రామ్ మండల్, ఉత్తమ్ మండల్, ఉజ్జల్ మండల్ అనే ముగ్గురు వలస కూలీలు అత్యాచారం చేసి, చంపేశారు. ఈ కేసులో 51 మంది సాక్షులను, 119 ఎగ్జిబిట్లను, 61 వస్తువులను పరిశీలించిన తర్వాత తీర్పు వెల్లడించారు.
ఈ కేసు విచారణ తమకు చాలా పెద్ద సవాలుగా మారిందని సీబీసీఐడీ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 13 రాత్రి ఆఫీసు నుంచి బయల్దేరిన ఉమామహేశ్వరి ఇంటికి తిరిగి వెళ్లలేదని, ఆమె మృతదేహం 22వ తేదీన బయటపడిందని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా ఈ కేసు విచారణకు పోలీసులు డ్రోన్ను ఉపయోగించారు. దాని సాయంతో పొదల్లో ఉన్న మృతదేహాన్ని కనుగొన్నారు. సీసీటీవీ ఫుటేజిలో ఆమె డెబిట్ కార్డుతో ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేస్తున్న ఓ వ్యక్తిని కనిపెట్టారు. మొబైల్ కాల్ డేటా రికార్డులను పరిశీలించిన తర్వాత.. రామ్, ఉత్తమ్లను విచారించారు. వాళ్లు తమ నేరాన్ని అంగీకరించారు. మరో నిందితుడు ఉజ్జల్ కోల్కతా పారిపోయినట్లు చెప్పారు. పోలీసులు అతడిని కూడా పట్టుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. చివరకు ముగ్గురికీ జీవితఖైదు పడింది.