పారని పాచిక


* బెడిసికొట్టిన చంద్రబాబు ‘ఎల్లో’ వ్యూహం

* ప్రలోభాలను, ప్రచారాలను తిప్పికొట్టిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు




సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: సంక్షోభం చుట్టుముట్టిముట్టినప్పుడల్లా ప్రజల దృష్టిని మరల్చడానికి ఏదో ఒక  దుష్ర్పచారాన్ని లేవదీయడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మించినవారు లేరు. మనసెరిగిన అనుంగు చానళ్లను, పత్రికలను ఉపయోగించుకుని ఈ ప్రచారాన్ని ఆయన పతాకస్థాయికి చేరుస్తారు.



పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌ను ఇలాంటి గోబెల్స్ ప్రచారంతోనే ఆయన వెన్నుపోటు పొడవడం అందరికీ తెలిసిన విషయమే. తొలిసారి సీఎం అయినప్పటి నుంచి ఎప్పుడు సంక్షోభం తలెత్తినా ఆయనది ఇదే బాణి. మరోసారి అలాంటి వ్యూహాన్ని ప్రయోగించబోయిన చంద్రబాబు ఇపుడు బొక్కబోర్లాపడ్డారు. ఆయన వేసిన పాచిక పారలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా తెలుగుదేశం పార్టీలో చేరడానికి క్యూ కడుతున్నారంటూ అనుకూల పత్రికల్లో పతాక శీర్షికల్లో వండి వార్చిన కథనాలు బెడిసికొట్టాయి.



ప్రతిపక్ష ఎమ్మెల్యేలంతా ముక్తకంఠంతో ఈ దుష్ర్పచారాలను ఖండించడంతో ఊహించని పరిణామానికి అధికార పార్టీ అధినేతకు దిమ్మతిరిగింది. తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను  ప్రలోభపెట్టడానికి ఆయన రంగం సిద్ధం చేశారని వినిపిస్తోంది. రెండేళ్లలో సంపాదించిన అవినీతి సొమ్మును విచ్చలవిడిగా వెదజల్లయినా కొద్దిమంది ఎమ్మెల్యేలను పార్టీలోకి ఆకర్షిద్దామనుకున్న ‘పథకం’ నీరుగారింది.

 

ఊపిరి సలపనీయని సంక్షోభాలు

ఇపుడు ఒకటోరెండో కాదు అనేక సంక్షోభాలు తెలుగుదేశం పార్టీని చుట్టుముట్టాయి. ఊపిరిసలపనీయనంతగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తెలంగాణలో పార్టీ మొత్తం ఖాళీ అయిపోయింది. ఎమ్మెల్యేలంతా ఒక్కరొక్కరుగా జారిపోతున్నారు. పార్టీ శాసనసభాపక్షనేతనే కాపాడుకోలేని పరిస్థితి. లీడర్లలోనూ కేడర్‌లోనూ నిస్పృహ ఆవరించింది. హామీలు నిలుపుకోని కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో కాపుల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తింది. వారికి వ్యతిరేకంగా బీసీలను రంగంలోకి దింపాలన్న ప్రయోగం బెడిసికొట్టింది.



దళితులపై మనసులో ఉన్న చులకనభావం మీడియా ముఖంగా బైటపడడం చిక్కులు తెచ్చిపెట్టింది. ఇవేకాదు.. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్ని గిమ్మిక్కులు చేసినా ఒక్క సీటుకు పరిమితం కావడం, జూన్‌లోగా రాజధానికి ఉద్యోగులను తరలించడం అసాధ్యంగా మారడం, రాజధాని పరిధిలో సొంత సామాజికవర్గమే తిరుగుబాటు బావుటా ఎగురవేయడం వంటివి కూడా బాబుకు తలనొప్పిగా మారాయి.



వీటని మించి ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే డిమాండ్లు ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడికక్కడ వేగవంతమవుతున్నాయి. వ్యవసాయ రుణాలు, డ్రాక్వా సంఘాల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తానని మాయమాటలతో  ముంచేసిన చంద్రబాబు సర్కారును ఆయా వర్గాలు ఈసడించుకుంటున్నాయి. టీడీపీ హామీలను నమ్మి ఓట్లు వేసి మోసపోయామని, వాటి గురించి పట్టించుకోకుండా  విదేశాల చుట్టూ తిరుగుతూ, తన సొంత కోటరీ ప్రయోజనకాలకే పెద్దపీట వేస్తూ, అవినీతికి ప్రోత్సహిస్తున్న సీఎం చంద్రబాబు ప్రతిష్ట నానాటికీ దిగజారుతోంది.

 

కాపాడని గోబెల్స్ ప్రచారం : సంక్షోభాలన్నీ చుట్టుముట్టడంతో చంద్రబాబు తన పాత వ్యూహాలకు పనిచెప్పారు. కోస్తా, రాయలసీమల్లో వైఎస్సార్‌కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా తెలుగుదేశంలో చేరడానికి క్యూ కడుతున్నారంటూ అనుకూల పత్రికల్లో పతాక శీర్షికల్లో గోబెల్స్ కథనాలను మొదలుపెట్టారు. బడ్జెట్ సమావేశాలు మరికొద్ది రోజుల్లో మొదలుకానున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మరల్చడానికి, తెలంగాణలో పోయిన పరువును కాపాడుకోవడానికి ‘ఆపరేషన్ ఆకర్ష్ ప్రచారా’నికి తెరతీశారు. పార్టీలోకి వచ్చేవారెవరూ లేకపోయినా కోస్తాలో కొందరు, రాయలసీమలో మరికొందరు ఎమ్మెల్యేల పేర్లను ప్రచారంలోకి తీసుకువచ్చారు.అప్రమత్తమయిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు దుష్ర్పచారాన్ని తీవ్రంగా ఖండించారు.



పత్రికలలో వండివార్చిన కథనాలపై చానళ్లలో చర్చలు జరపడం ద్వారా ఒకరకమైన ఉద్విగ్న పరిస్థితులు సృష్టించి బైటపడదామనుకున్న చంద్రబాబు వ్యూహం బెడిసికొట్టింది. ఒక మంత్రిని ప్రయోగించి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యేను హైదరాబాద్ రప్పించి భేటీ జరిపి ఆ ఒక్క ఉదంతంతో ఏదో అద్భుతం చేద్దామని చేసిన ప్రయోగం వికటించింది.



నియోజకవర్గ సమస్యలపై చర్చించడం కోసమే ముఖ్యమంత్రిని కలిశాను తప్ప మరో ప్రత్యేకత ఏమీ లేదని సదరు ఎమ్మెల్యే స్పష్టం చేయడంతో చంద్రబాబుకు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యిందని సమాచారం. జలీల్‌ఖాన్ సీఎంను కలసిన సమయంలో కలెక్టర్, మున్సిపల్ చైర్మన్ కూడా అక్కడే ఉన్నారు. ఆ విషయాన్ని మాత్రం ఎల్లోమీడియా ఉద్దేశపూర్వకంగా దాచేసింది.

 

దుష్ర్పచారాన్ని తిప్పికొట్టిన ఎమ్మెల్యేలు

వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా చంద్రబాబు అనుకూల మీడియా చేస్తున్న దుష్ర్పచారం విషయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు వేగంగా స్పందించారు. ఎక్కడికక్కడ పత్రి కా విలేకరుల సమావేశాలు పెట్టి పరిస్థితిని వివరించా రు. అందుబాటులో ఉన్న చానళ్లకు కూడా తమ వైఖరేం టో తెలియజేశారు. తమకు వ్యతిరేకంగా జరుగుతున్న గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టారు. చంద్రబాబు మైండ్‌గేమ్‌పై విమర్శల వర్షం కురిపించారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలలో కొంతమంది స్పందన ఇలా ఉంది...

 

ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం వైఎస్సార్ సీపీలోనే  ఉంటా. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే నడుస్తా. ఒక ఎమ్మెల్యేగా నియోజకవర్గ సమస్యలను ముఖ్యమంత్రికి విన్నవించేందుకు వెళితే పార్టీ మారుతున్నట్లేనా ?

     - జలీల్‌ఖాన్, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే

 

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి శిష్యుడిగా తుదివరకు వైఎస్ జగన్ వెంటే ఉంటా. నిలువెత్తు డబ్బు ఇచ్చినా పార్టీ మారను. వారిది స్వీయ మానసికానందం. మునిగిపోయే నౌకలో ఎవరైనా ఎక్కుతారా?      - మేకా వెంకట ప్రతాప్ అప్పారావు

                      నూజివీడు ఎమ్మెల్యే


 

తప్పుడు ప్రచారాలు చేస్తే పరువునష్టం దావా వేస్తాం. చంద్రబాబు నీచరాజకీయాలు మానుకోవాలి. గోబెల్స్ ప్రచారాలు కట్టిపెట్టాలి. ప్రజల్లో ఆదరణ, నమ్మకం కోల్పోయిన చంద్రబాబు మైండ్‌గేమ్ ఆడుతున్నారు.

- ముత్తుముల అశోక్‌రెడ్డి, పోతుల రామారావు, గొట్టిపాటి రవికుమార్, ఆదిమూలపు సురేష్, పాలపర్తి డేవిడ్‌రాజు, జంకె వెంకటరెడ్డి.  ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు

 

పత్రికలను ఉపయోగించుకున బాబు ఆడుతున్న మైండ్‌గేమ్ ఇది. నిజానికి టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలే వైఎస్సార్‌సీపీలోకి వలస రానున్నారు. తెలంగాణలో పోయిన పరువు కోసం చంద్రబాబు ఇలాంటి ప్రచారాలకు తెరతీశారు.

 - కాకాణి గోవర్ధన్ రెడ్డి, సర్వేపల్లి (నెల్లూరు) ఎమ్మెల్యే

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top