భార్యను చంపేసి కట్టుకథ
భార్య హత్యకేసులో యూపీ అభ్యర్థిపై చార్జిషీట్
న్యూఢిల్లీ: పక్కా ప్లాన్ తో కట్టుకున్న భార్యను హత్య చేసి ప్రమాదమని నమ్మించిన ఉత్తరప్రదేశ్ నాయకుడి గుట్టు రట్టైంది. అసెంబ్లీ ఎన్నికల్లో నౌతాన్వా స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న అమన్ మణి త్రిపాఠి తన భార్య సారాసింగ్ను గొంతునులిమి చంపాడని ఆయనపై సీబీఐ శనివారం చార్జిషీట్ నమోదు చేసింది.
ఫిరోజాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సారా చనిపోయిందని మణి చెప్పింది కట్టుకథ అని.. సమీపంలోని పొలంలో ఆమెను చంపేసి, గాయపడినట్లు చూపుతూ మృతదేహాన్నే ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించింది. పెళ్లి తరువాత సారాను అమన్ హింసించేవాడని విచారణలో తెలిసిందని సీబీఐ ప్రతినిధి ఆర్కే గౌర్ చెప్పారు. 2015, జూలై 9న రోడ్డు ప్రమాదం నాటకం ఆడి భార్యను హత్య చేశాడని తెలిపారు. నిందితునిపై నేరపూరిత కుట్ర, హత్య, వరకట్న వేధింపులకు సంబంధించిన సెక్షన్ల కింద అభియోగాలు మోపారు.
యూపీ మాజీ మంత్రి అమర్ మణి త్రిపాఠి కుమారుడైన అమన్ కు మొదట సమాజ్ వాదీ పార్టీ టిక్కెట్ ఇచ్చింది. తర్వాత అతడికి ఇచ్చిన టిక్కెట్ ను రద్దు చేసి మున్నా సింగ్ కు ఇవ్వడంతో అమన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగాడు.