కారుతో ఢీకొట్టి.. రెండు కిలోమీటర్లు లాక్కెళ్లి..
- మోపెడ్పై వెళుతున్న భార్యాభర్తలను ఢీకొన్న కారు
- ఎగిరి వాహనం ముందు భాగంలో ఇరుక్కున్న భార్య
- మృతదేహాన్ని రెండు కిలోమీటర్లు లాక్కెళ్లిన డ్రైవర్
- యువకులు వెంబడించడంతో కారును వదిలి పరార్
- భర్త పరిస్థితి విషమం.. హైదరాబాద్కు తరలింపు
- మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల వద్ద ఘటన
అడ్డాకుల: మహబూబ్నగర్ జిల్లాలో ఆది వారం నడిరోడ్డుపై అమానవీయ ఘటన చోటుచేసుకుంది. మోపెడ్పై వెళుతున్న భార్యాభర్తలను అతివేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్య ఎగిరి కారుపై పడి ముందుభాగంలో ఇరు క్కోగా.. రెండు కిలోమీటర్ల దూరం వరకు అలాగే లాక్కెళ్లింది. తీవ్రంగా గాయపడిన భర్తను చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. ఈ ఘటన అడ్డాకుల శివా రులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మహబూబ్నగర్ రూరల్ మం డలం గాజులపేటకి చెందిన తూర్పు మహేశ్వరమ్మ(48), సిద్ధిలింగం భార్యా భర్తలు. వీరికి ఇద్దరు కుమారులు శ్రీకాంత్, శేఖర్, కుమార్తె రాణి ఉన్నారు.
కుమార్తెను చూసి వద్దామని..
సిద్ధిలింగం ఇద్దరు కుమారులు హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. వనపర్తి జిల్లాకేంద్రంలో ఉండే కుమార్తె రాణి దంపతులు అక్కడ కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టారు. ఆదివారం కుమార్తెను పలకరించి వద్దామని భార్యాభర్తలిద్దరు మోపెడ్ (టీవీఎస్ చాంప్)పై వనపర్తికి బయలుదేరారు. అడ్డాకుల పోలీస్స్టేషన్ దాటిన తర్వాత 44వ జాతీయ రహదారిపై వెళ్తున్న మోపెడ్ను హైదరాబాద్ వైపు నుంచి వేగంగా వస్తున్న కారు (ఏపీ 29ఏడీ 2367) బలంగా ఢీకొట్టింది. దీంతో సిద్ధిలింగం తీవ్రంగా గాయపడి కిందపడిపోయాడు. మహేశ్వరమ్మ ఎగిరి కారుపై పడి ముందు భాగంలో ఇరుక్కుంది. అయినా డ్రైవర్ కారును ఆపకుండా మరింత వేగంగా తీసుకెళ్లాడు. ఈ విషయాన్ని గమనించిన బలీదుపల్లికి చెందిన వేణు, కృష్ణయ్య బైక్తో కారును వెంబడించారు.
వెల్టూరు శివారు వరకు రెండు కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత కారును ఆపి అందులో ఉన్న నలుగురు కలసి మహేశ్వరమ్మ మృతదేహా న్ని కారు పై నుంచి కిందపడేశారు. మళ్లీ అక్కడి నుంచి కారులో తప్పించుకునేం దుకు యత్నిస్తుండగా యువకులు అడ్డుకోవ డంతో కారును వదిలేసి పరారయ్యారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న ఎల్ అండ్టీ సిబ్బంది భార్యాభర్తలిద్దరిని అంబులెన్స్ లో మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. భర్త సిద్ధిలింగం పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో బంధువులు హైదరాబాద్కు తరలించారు. ప్రమాదానికి కారణమైన కారును పోలీసులు అడ్డాకుల పోలీస్ స్టేషన్ కు తరలించారు.