గుంటూరు-గుంతకల్లు డబ్లింగ్‌కు పచ్చజెండా

గుంటూరు-గుంతకల్లు డబ్లింగ్‌కు పచ్చజెండా - Sakshi


సాక్షి, న్యూఢిల్లీ : గుంటూరు–గుంతకల్లు మధ్య విద్యుదీకరణతో కూడిన రెండో రైల్వే లైను నిర్మాణానికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ బుధవారం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీఈఏ) ఈ నిర్ణయం తీసుకుంది. రూ. 3,631 కోట్ల అంచనా వ్యయంతో 401.47 కి.మీ. మేర రైల్వే లైనును నిర్మించనున్నారు.



ఐదేళ్లలో పూర్తయ్యే ఈ ప్రాజెక్టుకు అయ్యే వ్యయాన్ని కేంద్ర రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వం చెరి సగం భరిస్తాయి. రాజధాని నుంచి రాయలసీమ ప్రాంతానికి రైల్వే కనెక్టివిటీని పెంచాలంటూ ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నట్టు సీసీఈఏ అభిప్రాయపడింది.



గుంటూరు–గుంతకల్లు మధ్య గణనీయమైన స్థాయిలో ట్రాఫిక్‌ ఉందని, డబుల్‌ లైన్‌ నిర్మాణంతో భవిష్యత్తు అవసరాలను కూడా తీర్చుతుందని మంత్రిమండలి వివరాలను వెల్లడించిన కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. ఈ లైన్‌ వల్ల గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాలకు ప్రయోజనం కలుగుతుందని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు మీడియాకు వివరించారు. తూర్పు, ఈశాన్య రాష్ట్రాల నుంచి బెంగళూరు చేరేందుకు ఈ మార్గం సులువుగా ఉంటుందని పేర్కొన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top