ఇద్దరు కూతుళ్లను సజీవదహనం చేసి.. తండ్రి ఆత్మహత్య
మద్యం, గంజారుుకి బానిసై..
తల్లి, బంధువులు, పోలీసులు ఇంటి బయట ఉండగానే..
ఖమ్మం క్రైం: ఓ తండ్రి ఉన్మాదంతో ఇద్దరు పిల్లలను సజీవ దహనం చేసి, తనూ ఆత్మాహూతి చేసుకున్నాడు. తల్లి, బంధువులు, పోలీసులు ఇంటి బయట నిస్సహాయ స్థితిలో ఉండగా, ఈ దారుణం చోటుచేసుకుంది. ఖమ్మం నగరం బాబూ జగ్జీవన్రామ్ నగర్లోని వికలాంగుల కాలనీలో నివసిస్తున్న ఎండీ అన్వర్ పాషా ఆటోడ్రైవర్. అతనికి భార్య పర్వీన్, కూతుళ్లు రేష్మా(11), రిజ్వానా(6) ఉన్నారు. మద్యం, గంజాయికి బానిసైన అన్వర్ పాషా ఏ పని చేయకుండా తిరుగుతుండేవాడు. కూతురు రేష్మా నగరంలోని బాలవెలుగు పాఠశాలలో 4వ తరగతి, రిజ్వానా అంగన్వాడీ పాఠశాలలో ఎల్కేజీ చదువుతోంది. భార్యభర్తల మధ్య ఇటీవల తరుచూ గొడవలు జరుగుతున్నాయి. అన్వర్ పాషాకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవటంతో భార్యను పుట్టింటికి వెళ్లి డబ్బులు తెమ్మని వేధించేవాడు.
బక్రీద్ పండుగకు పిల్లలను తీసుకుని ఆమె నల్లగొండ జిల్లా కోదాడలోని సోదరి ఇంటికి వెళ్లింది. గురువారం మధ్యాహ్నం తిరిగి వచ్చింది. ఇన్ని రోజులు ఎక్కడకు వెళ్లావంటూ పర్వీన్పై అన్వర్పాషా దాడి చేసి ఇంటి నుంచి నెట్టివేశాడు. దీంతో పిల్లలను ఇక్కడే వదిలి ఆమె మళ్లీ కోదాడకు వెళ్లి తన సోదరితోపాటు బంధువులను తీసుకుని రాత్రి ఖమ్మం వచ్చింది.
టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు, పర్వీన్, ఆమె బంధువులు ఇంటికి వెళ్లారు. తలుపుకొట్టగా.. ‘మీరు ఇక్కడనుంచి వెళ్లకపోతే పిల్లలపై కిరోసిన్ పోసి, తాను పోసుకొంటానని’ బెదిరించాడు. దీంతో పోలీసులు, పర్వీన్.. ఆమె బంధువులు కొద్ది దూరం వెళ్లి నిల్చున్నారు. పిల్లలు నిద్రలో ఉండగా, వారిపై కిరోసిన్పోసి నిప్పంటించాడు. ఇంటి నుంచి మంటలు రావడంతో బయట ఉన్నవారంతా వెళ్లి తలుపు పగులగొట్టి.. మంటలు ఆర్పి చూడగా, అప్పటికే పూర్తిగా కాలి మాంసం ముద్దగా రహీమా, గాయాలతో కొట్టుమిట్టాడుతున్న రేష్మా, చనిపోయిన అన్వర్ పాషా కనిపించారు.
రేష్మా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. చిన్నారుల మృతదేహాలను పర్వీన్ తరుపువారు వారి స్వస్థలం అయిన కృష్ణా జిల్లా కంచికర్లకు తీసుకుని వెళ్లగా, అన్వర్ మృతదేహాన్ని అతని సోదరులు వికలాంగుల కాలనీకి తీసుకుని వెళ్లారు.