చెత్త కాగితాల్లో పేలుడు
మహబూబ్నగర్ జిల్లాలో ఘటన
ఇద్దరికి తీవ్ర గాయాలు
దేవరకద్ర : చెత్తకాగితాల దుకాణం వద్ద పేలుడు సంభవించడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం అజిలాపూర్లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బాలమ్మ(40)తన ఇద్దరు పిల్లలతో కలసి చెత్తకాగితాలు సేకరిస్తూ వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తోంది. అదేవిధంగా గద్వాలకు చెందిన వెంకటేశ్(45) కూడా చెత్తకాగితాలు సేకరిస్తూ ఇక్కడే ఉంటున్నాడు. బాలమ్మ చెత్తకాగితాలను విక్రయించేందుకు స్థానిక ఉర్దూమీడియం పాఠశాల ముందున్న చెత్తకాగితాల కొనుగోలు షాపు వద్దకు వచ్చింది. అప్పుడే వెంకటేశ్ కూడా చెత్తకాగితాలు అమ్మడానికి వచ్చాడు.
బాలమ్మ తెచ్చిన ప్లాస్టిక్ వస్తువులు, ఇతర పాత సామాన్లు తీసి బయటపెడుతుండగా ఒక్కసారిగా పెద్దశబ్దంతో పేలుడు సంభవించింది. ఏం జరిగిందో అర్థంకాని అయోమయ పరిస్థితి నెలకొంది. పేలుడుతో బస్టాండ్ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. ఈ ఘటనతో బాలమ్మ అపస్మారక స్థితిలోకి చేరుకుంది. మరోవైపు వెంకటేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం వారిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.