ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం తథ్యం
- బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు
కరీంనగర్ సిటీ: దేశంలో జరగనున్న 5 రాష్ట్రాల సాధారణ ఎన్నికల్లో బీజేపీ విజయం తధ్యమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పొల్సాని మురళీధర్రావు అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ విజయపరంపరలో కాంగ్రెస్ పార్టీ పట్టుతో పాటు ఉనికి కూడా కోల్పోతుందన్నారు.
ఆదివారం కరీంనగర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్కు పట్టున్న మహారాష్ట్రలో జరిగిన స్థానిక ఎన్నికల్లో బీజేపీ, ప్రధాని మోదీకి ఉన్న ప్రజాదరణ స్పష్టమైందన్నారు. సంస్థాగతంగా బలహీనంగా భావించే ఏడు రాష్ట్రాల్లో బీజేపీ దృష్టిసారించిందని.. అందుకు అసోమ్, బెంగాల్, ఒడిశా స్థానిక ఎన్నికలే నిదర్శనమన్నారు. కాంగ్రెస్ విముక్తి భారత్ లక్ష్యంగా బీజేపీ ముందుకెళ్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ అవినీతి పెరిగిపోయిందని, పూర్తిగా కాంట్రాక్టర్లు, కమీషన్ల ప్రభుత్వంగా మారిందని విమర్శించారు.