అధ్యక్షుడి భార్యే ఉపాధ్యక్షురాలు!!

అధ్యక్షుడి భార్యే ఉపాధ్యక్షురాలు!!

భార్యను ఇంతకంటే ఎక్కువగా ప్రేమించేవాళ్లు బహుశా ప్రపంచంలోనే ఎవ్వరూ ఉండరేమో. అజర్‌బైజాన్ అధ్యక్షుడు తన భార్యను ఆ దేశానికి మొట్టమొదటి ఉపాధ్యక్షురాలిగా నియమించేశారు. తన భార్య మెహ్రిబన్ (52)కు ఈ స్థానం కల్పిస్తున్నట్లు అధ్యక్షుడు ఇల్హమ్ అలియెవ్ (55) ప్రకటించారు. ఇందుకోసం ముందుగా ఆయన గత సెప్టెంబర్ నెలలో ఒక రాజ్యాంగ రిఫరెండం కూడా నిర్వహించారు. 19 ఏళ్ల వయసులోనే అలియెవ్‌ను పెళ్లి చేసుకున్న మెహ్రిబన్.. మెడికల్ యూనివర్సిటీ నుంచి వైద్యపట్టా పొందారు. ఇంతకుముందు కూడా ఆమె ప్రజాప్రతినిధిగా పనిచేశారు, ఒక చారిటీ సంస్థకు నేతృత్వం వహించారు. 

 

ఒకవేళ అధ్యక్షుడు విధులు నిర్వర్తించలేని పరిస్థితిలో ఉంటే.. రాజ్యాంగం ప్రకారం ఉపాధ్యక్ష స్థానంలో ఉన్నవారే అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇది కాక ఉపాధ్యక్షులు ఏం చేయాలో రాజ్యాంగంలో స్పష్టంగా లేదు. కానీ, కేబినెట్‌ను పర్యవేక్షించడం లాంటి బాధ్యతలు ఉంటాయని అనుకుంటున్నారు. 

 

గత సెప్టెంబర్‌లో నిర్వహించిన రిఫరెండం తర్వాత అధ్యక్షుడి పదవీ కాలాన్ని కూడా ఐదు నుంచి ఏడేళ్లకు పెంచారు. 2003 వరకు అలియెవ్ తండ్రి అజర్‌బైజాన్‌కు అధ్యక్షుడిగా ఉండేవారు. ఆ తర్వాత ఆయన నుంచి ఈయన పగ్గాలు అందుకున్నారు. అలియెవ్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. 
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top