800 మందిని ఇస్లాంలోకి మార్చారు
ముంబై: దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన దాదాపు 800 మందిని ఇస్లాంలోకి మార్చిన ఇద్దరిని ముంబై పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అర్షిద్ ఖురేషి, రిజ్వాన్ ఖాన్ లు ద్వారా ఇస్లాంకు మారిన వారిలో ముంబైకు చెందిన వారు కూడా భారీ సంఖ్యలోనే ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మతబోధకుడు జకీర్ నాయక్ కు చెందిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్(ఐఆర్ఎఫ్)తో ఇరువురికి సంబంధాలున్నట్లు తెలిపారు.
ఇద్దరి దగ్గర నుంచి కొన్ని పత్రాలు, పెళ్లి ధృవపత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీటిలో దాదాపు 800ల మందికి పైగా క్రిస్టియన్, హిందువులను ఇస్లాం మతంలోకి మారుస్తూ చూపుతున్నట్లు సాక్షాలున్నాయని వివరించారు. విచారణలో తానో మ్యారేజ్ బ్యూరో నడుపుతానని, ఎవరిని బలవంతంగా ఇస్లాంలోకి మార్చలేదని రిజ్వాన్ తెలిపినట్లు సమాచారం. ఐఆర్ఎఫ్ గొడుగు కింద భారీగా మత మార్పిడిలు జరుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ఐఆర్ఎఫ్ తో సంబధం లేకుండా మరో రెండు సంస్థలు మతమార్నిడులు చేస్తున్నట్టు గుర్తించామని వివరించారు.
మతమార్పిడులకు పాల్పడుతున్న సంస్థలు ప్రధానంగా కాలేజి విద్యార్థులు, జైల్లో పరిచయమైయ్యే ఖైదీలపై దృష్టిసారిస్తున్నట్లు చెప్పారు. కేసుల్లో నుంచి బయటపడేందుకు వారికి సాయం చేసి.. ఆ తర్వాత మతం మారాలని కోరుతున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. కాగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థల్లో ఒకటి ఖాన్ తో అధికారిక సంబంధాలేవీ లేవంటూ.. మత మార్పిడిల ఆరోపణలును తోసిపుచ్చింది.