యాపిల్ చీఫ్ టిమ్ కుక్...రూ.4,700 కోట్ల విరాళం
న్యూయార్క్: టెక్ దిగ్గజం యాపిల్ సీఈవో టిమ్ కుక్ (54).. సామాజిక సేవా కార్యక్రమాల కోసం యావదాస్తిని దానం చేయనున్నట్లు తెలిపారు. తన సోదరుని కుమారుడి కాలేజీ చదువుకు అయ్యే ఖర్చులను పక్కన పెట్టి, మిగతాదంతా ఇచ్చివేయనున్నట్లు వెల్లడించారు. సాధారణంగా పబ్లిసిటీకి దూరంగా ఉండే టిమ్ కుక్.. ఫార్చూన్ మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు తెలిపారు. ఫార్చూన్ అంచనాల ప్రకారం ఆయన ఆస్తి విలువ సుమారు 785 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 4,710 కోట్లు) ఉంటుంది. యాపిల్లో ప్రస్తుతం ఆయనకి ఉన్న షేర్ల విలువ 120 మిలియన్ డాలర్లు కాగా, మరో 665 మిలియన్ డాలర్ల విలువ చేసే షేర్లు ఆయనకు దఖలుపడనున్నాయి. సామాజిక సేవా కార్యక్రమాలకు బిలియనీర్ ఇన్వెస్టరు వారెన్ బఫెట్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తదితరులు ఇప్పటికే బిలియన్ల కొద్దీ డాలర్లు వితరణ చేస్తున్న సంగతి తెలిసిందే.