అమెరికాలో తల్లీబిడ్డల దారుణహత్య
ప్రకాశం జిల్లా తిమ్మరాజుపాలెం, కృష్ణాజిల్లా పోరంకిల్లో విషాదం
♦ అల్లుడే చంపేశాడంటున్న మృతురాలి తల్లిదండ్రులు
♦ పార్లమెంట్ ఉభయసభల్లో సభ్యుల ఆందోళన
♦ అమెరికా అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లాలని డిమాండ్
♦ జాతివివక్ష దాడులు కావన్న అమెరికా అధికారులు
పర్చూరు/పెనమలూరు: ప్రకాశం జిల్లాకు చెందిన ఓ మహిళ కొడుకుతో సహా అమెరికాలో దారుణహత్యకు గురయ్యారు. నర్రా శశికళ (35), హనీశ్సాయి (7)లను దుండగులు గొంతుకోసి చంపేశారు. ఈ హత్యల సమాచారంతో ప్రకాశం జిల్లా తిమ్మరాజుపాలెం, కృష్ణాజిల్లా పోరంకి గ్రామాల్లో విషాదం నెలకొంది. తమ కుమార్తెను, మనుమడిని అల్లుడే చంపేశాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన నర్రా హనుమంతరావు, శశికళ దంపతులు పదేళ్లుగా అమెరికా న్యూజెర్సీలోని మ్యాపుల్షేడ్లో ఉంటున్నారు. హనీశ్సాయి వీరి కుమారుడు.
హనుమంతరావు సీటీఎస్ కంపెనీలో అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తుండగా శశికళ అదే కంపెనీకి ఇంటి నుంచి (వర్క్ ఫ్రమ్ హోమ్) సేవలు అందిస్తున్నారు. హనుమంతరావు గురువారం హనీశ్సాయిని స్కూల్లో వదిలిపెట్టి విధులకు వెళ్లాడు. సాయంత్రం శశికళ కుమారుడిని స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చింది. ఆఫీస్ నుంచి తిరిగి వచ్చిన హనుమంతరావు ఇంటి తలుపులు తెరవగా భార్య, కుమారుడు రక్తపుమడుగులో పడి ఉన్నారు. గుర్తుతెలియని దుండగులు వీరిద్దరినీ గొంతుకోసి హత్యచేశారు. శుక్రవారం ఉదయం 6.30 గంటల సమయంలో హనుమంతరావు తిమ్మరాజుపాలెంలోని తల్లిదండ్రులు నర్రా శివపార్వతి, సుబ్బారావు, పోరంకిలో ఉన్న అత్తమామలు సుంకర కృష్ణకుమారి, వెంకటేశ్వరరావుకు ఫోన్చేసి విషయం తెలిపారు. అమెరికాలో పోలీసులు హత్య జరిగిన అపార్టుమెంట్ను సీజ్ చేసి, హనుమంతరావును విచారిస్తున్నట్లు సమాచారం.
అమెరికాలో హత్యలపై స్పందించండి: లోక్సభలో ఎంపీ వైవీ
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికాలో జరుగుతున్న జాతివివక్ష హత్యలపై కేంద్రం వెంటనే స్పందించి నిర్మాణాత్మక చర్యలకు నడుం బిగించాలని వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్రాన్ని కోరారు. ప్రకాశం జిల్లాకు చెందిన నర్రా శశికళ, ఆమె కుమారుడు హత్యకు గురైన విషయాన్ని ఆయన శుక్రవారం లోక్సభ జీరో అవర్లో కేంద్రం దృష్టికి తెచ్చారు. ‘అమెరికాలోని భారతీయులపై దాడులు తగ్గడం లేదు. కూచిభట్ల శ్రీనివాస్ హత్యను మరవకముందే మళ్లీ అలాందే జరగడం విషాదకరం’ అని అన్నారు. తల్లీకొడుకుల దారుణ హత్యల్ని తీవ్రంగా పరిగణించా లని రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ కూడా ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని పార్లమెంటరీ వ్యవహారా లశాఖ మంత్రి నక్వీకి సూచించారు. ఇదిలా ఉండగా ఈ హత్యపై అమెరికా అధికారులతో మాట్లాడుతున్నామని విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి గోపాల్ బాగ్లే మీడియాతో చెప్పారు. ఈ దారుణ హత్యలకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని ఇండియన్–అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర చెప్పారు. మృతదేహాలను భారతకు పంపేందుకు తానా సహాయం చేస్తుందని చెప్పారు.
(ఎన్నారైల హత్య.. వివాహేతర సంబంధమే కారణమా?)
ఇవి జాతివివక్ష హత్యలు కాదు..
భారత్కు చెందిన ఐటీ ఉద్యోగిని శశికళ, ఆమె కుమారుడు న్యూజెర్సీలో మ్యాపుల్షేడ్లోని తమ ఇంట్లో దారుణ హత్యకు గురయ్యారని బర్లింగ్టన్ కౌంటీ ప్రాసిక్యూటర్ రాబర్ట్ బెర్నార్డి, మ్యాపుల్షేడ్ పోలీస్ చీఫ్ గ్యారీ గుబ్బే చెప్పారు. దుండగులు వారిని పలుమార్లు కత్తితో పొడిచి దారుణంగా హత్యచేశారన్నారు. కొందరు మీడియా ప్రతినిధులు పేర్కొన్నట్లు ఈ హత్యలు జాతివివక్షతో జరిగాయనేదానికి ఆధారాలు లేవని ప్రాసిక్యూటర్ కార్యాలయం పీఆర్వో జోయల్ బెవ్లీ చెప్పారు.
శశికళ మృతితో విలపిస్తున్న తల్లిదండ్రులు
అల్లుడే హత్య చేయించాడు: వెంకటేశ్వరరావు
తమ కుమార్తెను, మనుమడిని అల్లుడే హత్య చేయించి ఉంటాడని శశికళ తండ్రి వెంకటేశ్వరరావు ఆరోపించారు. పోరంకిలో మీడియాతో మాట్లాడుతూ.. శశికళకు, హనుమంతరావుకు 2004లో వివాహమైందని.. డబ్బుల కోసం కుమార్తెను అల్లుడు వేధించేవాడని చెప్పారు. హనుమంతరావుకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందన్నారు. తమ కుమార్తె భర్త ఆగడాలను పలుమార్లు ఫోన్లో తెలిపేదని, కొద్దిరోజుల కిందట అతడు కొట్టినట్లు కూడా చెప్పిందని తెలిపారు. కిరాయి హంతకులతో తమ అల్లుడే ఈ హత్యలు చేయించి ఉంటాడని చెప్పారు.