ఏపీ బంద్‌కు జగన్ పిలుపు

ఏపీ బంద్‌కు జగన్ పిలుపు - Sakshi


హోదా హుళక్కిపై భగ్గుమన్న వైఎస్సార్‌సీపీ

- టీడీపీ, బీజేపీ వైఖరికి నిరసనగా 2న బంద్

- ప్రతిఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలన్న ఏపీ ప్రతిపక్ష నేత

- జైట్లీ జవాబుతో రాష్ట్రానికి హోదా అవకాశమే లేదని రూఢీ అయింది

- ప్రత్యేక హోదా సంజీవని కాదని చంద్రబాబు అన్నారు

- ఐదుకోట్ల మంది ప్రజల భవిష్యత్తుతో చెలగాటం ఆడారు

- బీజేపీ నిర్ణయానికి తెలుగుదేశం వైఖరే కారణం

- రెండేళ్లుగా డ్రామాలు మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగమే

 

 ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా లభించే అవకాశమే లేదని జైట్లీ శుక్రవారం రాజ్యసభకు ఇచ్చిన సమాధానంతో రూఢీ అయింది. అయినా నిర్లజ్జగా కేంద్ర ప్రభుత్వంలో కొనసాగడానికి టీడీపీ నిర్ణయించుకున్నట్టు కూడా స్పష్టమైంది. బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వదు.. టీడీపీ పట్టుబట్టదు. ఆ రెండు పార్టీల దుర్మార్గ వైఖరికి నిరసనగా, ఐదు కోట్ల ప్రజల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని హోదా కోసం పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 2న రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తోంది.    - వైఎస్ జగన్

 

 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే విషయంలో బీజేపీ, టీడీపీలు వ్యవహరిస్తున్న దుర్మార్గ వైఖరికి నిరసనగా ఆగస్టు 2న ఏపీ బంద్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు వైఎస్ జగన్ చేసిన ప్రకటనను పార్టీ శుక్రవారం మీడియాకు విడుదలచేసింది. ‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా లభించే అవకాశమే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ శుక్రవారం రాజ్యసభకు ఇచ్చిన సమాధానంతో రూఢీ అయింది. అయినప్పటికీ నిర్లజ్జగా కేంద్ర ప్రభుత్వంలో కొనసాగడానికి తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకున్నట్టు కూడా స్పష్టమైంది.



బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వదు. టీడీపీ పట్టుబట్టదు. ఆ రెండు పార్టీల దుర్మార్గ వైఖరికి నిరసనగా, ఐదు కోట్ల ప్రజల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక హోదా కోసం నిరంతరం పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 2వ తేదీన రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తోంది’ అని వైఎస్ జగన్ తన ప్రకటనలో తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ ఈ బంద్‌లో పాల్గొనాలని, అందరూ సహకరించి విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా సంజీవని కాదని, సాక్షాత్తూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నందువల్లే బీజేపీ ఈ నిర్ణయానికి రాగలిగిందని జగన్ స్పష్టం చేశారు. ఐదు కోట్ల ప్రజల భవిష్యత్‌తో రాష్ట్ర ముఖ్యమంత్రే చెలగాటం ఆడారని మండిపడ్డారు.



తన మీద కేసులు లేకుండా చూసుకుంటే చాలు, ఏపీ ప్రజలకు ఎంత అన్యాయం చేసినా నోరుమెదపబోమన్న వైఖరి వల్లే బీజేపీ ఈ దుస్సాహసానికి ఒడిగట్టిందని ఆయన తెలియజేశారు. రాజ్యసభలో చర్చ జరిగిన తీరు, టీడీపీ ఎంపీలు, ఆ పార్టీ నాయకత్వం ఈ సందర్భంగా చేసిన ప్రకటనలు, రెండేళ్లుగా ఆడుతున్న డ్రామాలు మొత్తం.. ఈ రెండు పార్టీల మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగమేనని తెలిపారు. ఈ పార్టీలకు బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.

 

 కేసుల భయంతోనే...

 రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలన్న సంకల్పమే చంద్రబాబుకు లేదని వైఎస్సార్‌సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. రాజ్యసభలో అరుణ్ జైట్లీ ప్రకటన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రం వైఖరి బాధ కలిగించిందని చంద్రబాబు బేలగా మాట్లాడటమే ఇందుకు నిదర్శనం. ఇప్పటికైనా కేంద్రంపై పోరాడాలనే ఆలోచన టీడీపీ అధినేతకు రాకపోవడం గమనార్హం. హోదా కోసం తెలుగుదేశం గట్టిగా పట్టుబట్టి ఉంటే ఫలితం వేరుగా ఉండేది.



కానీ ఆ పార్టీ ఎంపీలు రాజ్యసభలో చేసిన ప్రసంగాలు హోదా సాధనపై వారికి చిత్తశుద్ధి లేదని స్పష్టం చేశాయి. జైట్లీ ప్రకటన బాధ కలిగించిందని మాత్రమే చంద్రబాబు అన్నారు కానీ.. కేంద్రం నుంచి వైదొలగుతామనో, మంత్రులతో రాజీనామా చేయిస్తామనో కనీసం హెచ్చరికగా కూడా ఆయన మాట్లాడలేకపోయారని వైఎస్సార్‌సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఓటుకు కోట్లు కేసులో సాక్ష్యాధారాలతో సహా దొరికిపోవడం, రాష్ట్రంలో అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతున్న నేపథ్యంలో.. హోదా కోసం ఒత్తిడి చేస్తే కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయంతోనే చంద్రబాబు రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top