నటిపై అత్యాచారం: ఆ రాత్రి ఏం జరిగిందంటే..!

నటిపై అత్యాచారం: ఆ రాత్రి ఏం జరిగిందంటే..!


పల్సర్‌ సునీకి ఫోన్‌ చేయడంపై నిర్మాత వివరణ



కొచ్చి: మలయాళ కథానాయిక కిడ్నాప్‌, లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ నిర్మాత అంటో జోసెఫ్‌ పేరు వెలుగుచూడటం కలకలం రేపుతోంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి పల్సర్‌ సునీకి చివరిసారిగా ఫోన్‌ చేసింది జోసెఫ్‌నేనని తేలడంతో ఆయన ప్రమేయంపై అనేక కథనాలు వస్తున్నాయి. వ్యక్తిగత కక్షతోనే నటిపై ఈ దుర్మార్గాన్ని చేయించాడా? అని అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కథనాల నేపథ్యంలో ఆయన మీడియా ముందుకు వచ్చారు. గత శుక్రవారం నటి కిడ్నాప్‌, లైంగిక వేధింపులకు గురయిన అనంతరం ఏం జరిగిందో వివరించారు. ఆయన ఏమన్నారంటే..



'ఘటన జరిగిన తర్వాత మొదట దర్శకుడు లాల్‌ నాకు ఫోన్‌ చేశారు. నా ఫోన్‌ సైలెంట్‌ మోడ్‌లో ఉండటంతో నేను ఎత్తలేదు. ఆ తర్వాత రెంజీ పనిక్కర్‌ నాకు ఫోన్‌ చేసి.. జరిగిన ఘటన గురించి చెప్పారు. సాధ్యమైనంత త్వరగా లాల్‌ ఇంటికి రమన్నారు. దీంతో నేను ఎమ్మెల్యే పీటీ థామస్‌తోపాటు లాల్‌ ఇంటికి చేరుకున్నాను. పోలీసులు, (నటి డ్రైవర్‌) మార్టిన్‌ అప్పటికే అక్కడ ఉన్నారు. పీటీ థామస్‌ మార్టిన్‌ను ప్రశ్నించాడు. అతని దగ్గరి నుంచి పల్సర్‌ సుని నంబర్‌ తీసుకున్నాను.



నా నంబర్‌ నుంచి మార్టిన్‌ సునికి ఫోన్‌ చేశాడు. మొదట అతను లిఫ్ట్‌ చేయలేదు. కానీ ఆ తర్వాత కాల్‌బ్యాక్ చేసి నువ్వు ఎవరు అని అడిగాడు. నా గురించి చెప్పడంతో వెంటనే పెట్టేశాడు. అంతే తప్ప అతనికితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయాన్ని పోలీసులకు కూడా తెలిపాను. అది దారుణమైన ఘటన. ఇలాంటి ఘటన ఏ అమ్మాయికి కూడా జరగకూడదు' అని అంటో జోసెఫ్‌ పేర్కొన్నారు. కారులో దుండగులు తనను లైంగికంగా వేధింపులకు గురిచేసిన అనంతరం నటి దర్శకుడు లాల్‌ దగ్గరికి వెళ్లిన సంగతి తెలిసిందే.  ఆ తర్వాతే తాను పల్సర్‌ సునికి ఫోన్‌ చేశానని జోసెఫ్‌ చెప్తున్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top