వివాదంలో మరో బీజేపీ ఎమ్మెల్యే
కోట/చెన్నై: నాలుగు రోజుల వ్యవధిలో రాజస్థాన్ లో మరో బీజేపీ ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. కోట జిల్లాలోని లాడ్పూరాకు ప్రాతినిథ్యం వహిస్తున్న భవాని సింగ్ రాజావత్ ఓటర్లను బెదిరిస్తూ వీడియాకు చిక్కారు. నవంబర్ లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఆయన ఓటర్లను బెదిరించారు. తమ పార్టీకి ఓటు వేయకుంటే తీవ్రపరిణామాలుంటాయని హెచ్చరించారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ హల్ చేయడంతో బీజేపీ అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ ఉదంతంపై పార్టీ క్రమశిక్షణా కమిటీ దర్యాప్తు జరుపుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెన్నైలో చెప్పారు. కాంగ్రెస్ కు కాకుండా తమ పార్టీకి ఓటు వేయాలని మాత్రమే ఓటర్లను కోరానని భవాని సింగ్ అన్నారు. నర్సు బదిలీపై అధికారిని దూషించిన మరో ఎమ్మెల్యే ప్రహలాద్ గుంజాల్ ను బీజేపీ శనివారం సస్పెండ్ చేసింది.