చంద్రబాబు రాయలసీమ ద్రోహి
అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహి అని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ధ్వజమెత్తారు. కరువులు తట్టుకోలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, లక్షలాది మంది వలసలు వెళుతున్నా చంద్రబాబు పట్టించుకోవటం లేదని ఆయన మండిపడ్డారు. హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం (హెచ్ఎన్ఎస్ఎస్) మొదటి దశ కింద జిల్లాలో 1.18 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలన్న డిమాండ్ తో సోమవారం ఉరవకొండలోని వీరశైవ కల్యాణ మండలంలో రైతు సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ పట్టిసీమ నుంచి కృష్ణాడెల్టాకు 80 టీఎంసీలు నీటిని తరలిస్తున్నారని, అలాంటిది శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటీని తరలిస్తూ ఎందుకు జీవో జారీ చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యవసాయం దండగన్న సిద్ధాంతంతో చంద్రబాబు ముందుకెళ్తున్నారని, హంద్రీనీవాకు ఆయకట్టుకు నీరు ఇవ్వకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు.