వైఎస్పై నెట్టడం ఆనవాయితీగా పెట్టుకున్నారు: అంబటి రాంబాబు
సాక్షి, హైదరాబాద్: మరణించిన వైఎస్ రాజశేఖరరెడ్డి వచ్చి సమాధానం చెప్పుకోలేరని ప్రతీ విషయాన్ని మహానేతకు అంటగట్టి నీచమైన రాజకీయాలు చేయడం కాంగ్రెస్కు పరిపాటిగా మారిందని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ‘‘గతంలో చిరంజీవిని పార్టీలోకి చేర్చుకునేటప్పుడు కూడా ఆ నెపాన్ని వైఎస్పైనే నెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు రాష్ట్ర విభజనను కూడా వైఎస్కు ముడిపెట్టి సీఎం కిరణ్కుమార్రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటు.
వైఎస్ పాలించినప్పుడు కాంగ్రెస్ అధిష్టానం విభజన గురించి ఎందుకు ఆలోచించలేదు? వైఎస్ మరణం తర్వాతనే ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? వీటన్నింటికీ సమాధానం చెప్పాలి. ఆనాడు రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటనను ఒకసారి కిరణ్ గుర్తుచేసుకోవాలి. ఈ రోజు కిరణ్ లేవనెత్తిన అంశాలనే గతంలో రాజశేఖరరెడ్డి సభలో ప్రస్తావించారు. అలాంటిది వైఎస్పై బురద చల్లడమేంటి? ఈ రోజు దొంగ నాటకాలు ఆడుతున్నారంటూ ఇతర పార్టీలను కిరణ్ విమర్శించడం ఆయన దివాలాకోరుతనాన్ని తెలియజేస్తుంది. సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువడినప్పుడు ఆయనేం చేశారు? అప్పుడు చప్పుడు చేయకుండా ఇప్పుడు దొంగ నాటకం ఆడుతున్నది కిరణే’’ అని దుయ్యబట్టారు.